హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఓవల్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ప్రపంచం మొత్తం మాదిరిగానే తాను కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు సచిన్ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో గెలిచే అవకాశం ఉందని సచిన్ చెప్పుకొచ్చాడు. 'ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్పై ఎప్పుడూ మనదే పైచేయి. ఇప్పుడు కూడా బాగా ఆడాలి. ఈ మ్యాచ్ గెలిస్తే అందరం సంబరాలు చేసుకుంటాం' అని సచిన్ పేర్కొన్నాడు.
ఓవల్ మైదానంలో ఉండి ఈ మ్యాచ్ చూస్తూ.. భారత జట్టుకు అడుగడుగునా మద్దతు, ఉత్సాహం అందిస్తానని ఈ సందర్భంగా సచిన్ చెప్పాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్తోపాటు కోహ్లి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. యువరాజ్ కూడా బాగా ఆడాడు. పేస్ బౌలర్లు అద్భుతమైన ప్రతిభను చూపుతున్నారు' అని సచిన్ అన్నాడు.
'స్పిన్నర్లు రాణించారు. ధోని సేవలను కూడా తక్కువ చేయలేం. బాయ్స్ అందరూ గొప్ప ఆటతీరు చూపుతున్నారు. ఆదివారం కూడా మన ఆటగాళ్లు ఇదే తరహా ప్రదర్శన ఇస్తే.. మనల్ని ఢీకొట్టడం ఎవరితరం కాదు. పాక్ జట్టు అస్థిరతతో బాధపడుతోంది. కానీ, ఆదివారం ఓ కొత్త రోజు అని మరువకూడదు. ఎప్పటిలాగే సర్వసన్నద్ధతతో ఈ మ్యాచ్కు సిద్ధం కావాలి' అని సచిన్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచిన సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎవరన్నది కాకుండా.. తమ జట్టు సభ్యులంతా పూర్తి శక్తియుక్తులతో ఆడతారని అన్నారు. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది.
టోర్నీలో భాగంగా రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో తలపడిన జట్టే ఫైనల్లో ఆడుతుంది. ఇక రాయిస్ స్థానంలో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బలంగా కోరుకుంటోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో పాక్పై భారత్ 13-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది.