హైదరాబాద్: జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా బుధవారం ఇంగ్లాండ్ బయల్దేరనుంది. ఈ క్రమంలో బుధవారం విరాట్ కోహ్లీ ముంబైలో మీడియాతో మాట్లాడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకుంటామని కోహ్లీ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని టాప్ టీమ్లే పాల్గొంటాయి కాబట్టి పోటీ అధికంగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం టీం అన్ని విభాగాల్లో బాగుందని చెప్పాడు. ఆడుతున్న ప్రతి మ్యాచ్లో గెలవాల్సిందేనని కోహ్లీ అన్నాడు. గ్రూప్లో టాప్లో ఉంటేనే టోర్నీలో నిలుస్తామని కోహ్లీ అన్నాడు.
జూన్ 4న పాకిస్థాన్తో తొలి మ్యాచ్ ఆడుతున్నామని పేర్కొన్నాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుందని, మాకు మాత్రం అది క్రికెట్ మ్యాచ్యేనని చెప్పాడు. యువరాజ్, ధోనీలు మాతో ఉండటం జట్టుకు అదనపు బలమని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో భావోద్వేగాలు పెల్లుబుకే అవకాశం ఉందని అన్నాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించి, కప్పు కొట్టినట్లే ఈ సారి కూడా రాణించి అన్ని మ్యాచుల్లోనూ గెలుస్తామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. గత టోర్నీలో రోహిత్, ధావన్, అశ్విన్, జడేజా బాగా ఆడారని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది.
ధోనీ నేతృత్వంలోని టీమిండియా 2013లో ఇంగ్లాండ్లోనే జరిగిన ట్రోఫీలో ఇంగ్లాండ్ పైనే 5 పరుగులతో విజయం సాధించి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది. కాగా, జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతున్నాయి.