పుణె : భారత్పై తొలి టెస్టు మ్యాచును గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారత్పై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ర్యాంక్ టర్నర్ పిచ్ తయారు చేయాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందని, కోహ్లీ అండ్ కంపెనీ మ్యాచ్ను తమ చేతుల్లో పెట్టిందని మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత స్మిత్ అన్నాడు.
ఈ టెస్ట్ విజయం చిరస్మరణీయమని, ఎందుకంటే 4,502 రోజులుగా తమకు ఇక్కడ విజయం లేదని అన్నాడు. జట్టు సభ్యులు ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఆతురతతో ఉన్నారని ఆయన అన్నాడు. తొలి సవాల్కు దీటుగా జవాబిచ్చారని కొనియాడాడు. పుణెలో అలవోకగా నెగ్గడంతో రెండో మ్యాచ్ జరిగే బెంగళూరులో పిచ్ ఎలా ఉంటుందో చూడాలని స్మిత్ అన్నాడు.
భారత్ వరుస విజయాలకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. 2004 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ గడ్డపై భారత్ను ఓడించగలిగింది. ఈ విజయం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు. తమకు మంచి జట్టు ఉందని, మంచి స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు.
ముఖ్యంగా ఓకీఫె అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడని అన్నాడు. ఒక దశలో ప్రతి బంతికి వికెట్ తీస్తున్నట్టు కనిపించాడని అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇలాంటి పిచ్పై తాను సెంచరీ చేయడానికి నిబద్దత కావాలన్నాడు. ఇక్కడ తనకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చిందని స్మిత్ అన్నాడు.
మొదటి ఇన్నింగ్స్ తర్వాత 160 పరుగుల ఆధిక్యం సాధించడానికి మిచెల్ స్టార్క్ చేసిన 61 పరుగులు చాలా కీలకంగా మారాయని అన్నాడు. అయితే సిరీస్లో ఇంకా మిగిలిన మూడు మ్యాచ్లలో కూడా ఇలానే తమ ప్రదర్శన కొనసాగిస్తామని తెలిపాడు.