ధర్మశాల: తమ తనయుడు అంతర్జాతీయ ఆరంగేట్రంతో పాటు తొలి మ్యాచులోనే అసాధారణ ప్రదర్శన చేయడంతో కుల్దీప్ యాదవ్ తల్లిదండ్రుల ఆనందానికి అవదుల్లేవు. కుల్దీప్ తండ్రి రామ్ సింగ్, తల్లి ఉష, సోదరి కాన్పూర్లోని తమ నివాసంలో శనివారం టీవీలకు అతుక్కుపోయారు.
అతను తొలి వికెట్ తీసినప్పుడు ఎంతో అనుభూతికి లోనయ్యారు. ఆ వెంటనే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఇరుగుపొరుగు రావడంతో వారి ఇంట పండగ వాతావరణం కనిపించింది.
శుక్రవారం సాయంత్రం కుల్దీప్ ఫోన్ చేసి ఈ మ్యాచులో బరిలోకి దిగే అవకాశముందని తమకు చెప్పాడని, దాంతో రాత్రంతా తాము నిద్రపోలేదని, అతను ఎప్పుడూ బాగానే ఆడుతాడని, తమ అబ్బాయికి ప్రజల ప్రేమ, దేవుడి ఆశీస్సులు ఉన్నాయని తండ్రి రామ్ సింగ్ చెప్పారు.
కాగా, అరంగేట్రం టెస్టులోనే కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ మూడు వికెట్లు తీసి కంగారూలకు కంగారు పుట్టిస్తున్నాడు.
48వ ఓవర్ నాలుగో బంతికి మాక్స్వెల్(8)కు నాలుగు పరుగులు ఇచ్చిన కుల్దీప్.. అదే ఓవర్ చివరి బంతికి క్లీన్బౌల్డ్ చేశాడు. లంచ్ తర్వాతే నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.