హైదరాబాద్: కటక్లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు సెంచరీలతో చెలరేగారు. యువరాజ్ సింగ్కు ఈ సెంచరీ 14వ సెంచరీ కాగా, ధోనికి పదో సెంచరీ కావడం విశేషం.
మూడు వన్డేల సిరిస్లో భాగంగా పూణెలో జరిగిన తొలి వన్డేలో విఫలమైన వీరిద్దరూ కటక్ వన్డేలో చెలరేగి ఆడారు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను వీరిద్దరూ నిలకడగా ఆడి ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 256 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అంతక ముందు 126 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడిన యువీ అంతే వేగంగా 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు. ధోని సైతం 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు.
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన యువీ తన ఎంపికను ప్రశ్నించినవారికి బ్యాట్తో సమాధానమిచ్చాడు. 2011లో చివరిసారిగా వరల్డ్ కప్లో సెంచరీ సాధించిన యువరాజ్ మళ్లీ ఆరేళ్ల తర్వాత సెంచరీని సాధించడం విశేషం. ఇక ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.
మళ్లీ మూడేళ్ల తర్వాత ధోని సెంచరీని సాధించాడు. ఇక ఇంగ్లాండ్పై అద్భుతమైన రికార్డు ఉన్న యువరాజ్ ఆ జట్టుపై నాలుగో సెంచరీ సాధించాడు. మరోవైపు కటక్ వన్డేలో యువరాజ్ వన్డేల్లో అత్యధిక అత్యుత్తమ స్కోరుని సాధించాడు. గతంలో 2004లో ఆస్ట్రేలియాపై సాధించిన 139 పరుగుల స్కోరును యువరాజ్ అధిగమించాడు.