హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులకే పెవిలియన్కు చేరి అభిమానులను నిరాశపర్చాడు.
ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దీంతో భారత్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు పర్వత ప్రాంతాలను వీక్షిస్తూ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం ఓ పర్వత ప్రాంతంపై ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్న ఫోటోని ట్వీట్ చేశాడు.
'గడుస్తున్న ప్రతిరోజూ ఒక అవకాశం. ఆశీర్వాదం. గొప్పగా ఉండాలి. ముందుకు సాగిపోవాలి' అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బెంగళూరులో మార్చి 4 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Everyday is a blessing and an opportunity. Be grateful and keep moving ahead. 😇✌️ pic.twitter.com/zaq1gPlkwR
— Virat Kohli (@imVkohli) 27 February 2017