హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. వరుస టెస్టు విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఈ సిరిస్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉండగా, మరోవైపు తమ పూర్వ వైభవాన్ని తిరిగి సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆస్ట్రేలియా ఉంది.
అయితే టీమిండియాను అజ్యింకే రహానే ఫామ్ వేధిస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు జట్టు విజయాలతో పాలు పంచుకున్న రహానే గత కొన్ని టెస్టులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ వర్సెస్ రహానేగా మారింది. లియోన్ని రహానే ఏమేరకు ఎదుర్కొండానే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
కెప్టెన్ కోహ్లీ కూడా రహానేకే తన పూర్తి మద్దతుని తెలిపాడు. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన టెస్టు సిరిస్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ను పక్కన బెట్టి రహానేకు తుది జట్టులో చోటు కల్పించడం కూడా రహానేను ఒత్తిడిలో పడేసింది. తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న రహానే ఆశించిన మేరకు రాణించకపోతే వేటు పడుతుందేమో.
మరోవైపు భారత్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలించడంతో ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన స్పిన్నర్గా ఉన్న నాథన్ లియోన్పైనే అందరి దృష్టి నెలకొంది. నాథన్ ఎంతగా రాణిస్తే జట్టుకు అంత ప్రయోజనం ఉంటుందని ఆస్ట్రేలియా జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇక కెప్టెన్ కోహ్లీని కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలున్నాయని ఆసీస్ బౌలర్లు చెప్తున్నారు.
కోహ్లీ కోసం ప్రత్యేక ప్రణాళికలను కూడా సిద్ధం చేసినట్లు స్వయాన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇంతక ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్తో తాను ఆడిన మూడు టెస్టుల్లో లియోన్ 15 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఇన్నింగ్స్లో 5 వికెట్లు ఉన్నాయి. రహానే తర్వాత పూజారాను ఆసీస్ బౌలర్లు టార్గెట్గా పెట్టుకున్నారు.