హైదరాబాద్: తన ఆటలో ఎలాంటి లోపం లేదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ను అత్యంత ప్రమాదకర బ్యాట్స్మన్గా అంతా భావించారు. ఈ సిరిస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇప్పటివరకు అతడు ఆడిన ఆరు ఇన్నింగ్స్లో కేవలం వార్నర్ చేసింది 131 పరుగులే కావడం విశేషం. బెంగళూరు టెస్టులో చేసిన 33 పరుగులే ఈ సిరీస్లో వార్నర్ అత్యధిక స్కోరు. అయితే తన బ్యాటింగ్ తీరులో ఎలాంటి లోపం లేదని, త్వరలోనే భారీ స్కోరు సాధిస్తానని మంగళవారం మీడియాతో మాట్లాడిన వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు.
'నా ఆటలో ఎలాంటి లోపం లేదు. బంతిని బాగానే కొడుతున్నా. కానీ ప్రస్తుతం పరుగులు రావడం లేదు అంతే. ఇకపై ఈ పరిస్థితి మారిపోతుంది. పరుగులు వస్తాయి' అని వార్నర్ చెప్పాడు. 'నా సన్నాహకాల్లోనూ ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను క్రమశిక్షణను కొనసాగిస్తే చాలు. ఇప్పుడు కూడా ఎప్పటిలాగే సన్నద్ధం కావాలి. దేనిని మార్చొద్దు. ఎప్పుడు ఆడినట్లే ఆడాలి' అని అన్నాడు.
ఎలాంటి దిగ్గజ ఆటగాళ్లయినా కెరీర్లో ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోతారని వార్నర్ చెప్పాడు. 'ఏ స్థాయి క్రికెటర్కైనా ఇలాంటి స్థితి వస్తుంది. స్వదేశంలో కావచ్చు.. విదేశీ పర్యటనలో కావచ్చు ఫామ్ కోల్పోవాల్సి వస్తుంది. ఇదంతా క్రికెట్లో భాగమే. ఇలాంటి దశలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి' అని వార్నర్ తెలిపాడు. చివరి టెస్టులో మరో ఓపెనర్ మ్యాట్ రెన్ షాతో కలిసి చక్కటి శుభారంభాన్ని అందిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సిరిస్లో చివరి టెస్టు మార్చి 25 నుంచి ధర్మశాలలో ప్రారంభం అవుతుంది. ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి.