హైదరాబాద్: నాలుగు టెస్టుల సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరులో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పెదవి విరిచాడు. ఈ తరహా పిచ్లపై తొలుత టాస్ గెలిచిన వారే విజయం సాధిస్తారని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో అదే నిజమైందని తెలిపాడు. పూణెలో తయారు చేసిన పిచ్నే ఇక్కడ కూడా తయారు చేశారని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విజయం భారత జట్టుకు ప్రత్యేకమైనదని అభివర్ణిస్తూనే, ఈ తరహా పిచ్లపై టాస్ ఓడితే, మ్యాచ్ ఓడినట్టేనని గంగూలీ వ్యాఖ్యానించాడు.
ఇక రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ చీటింగ్పై కూడా గంగూలీ స్పందించాడు. 'స్మిత్ డీఆర్ఎస్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అంపైర్లు స్వయంగా చూశారు. కాబట్టి చర్యల కోసం వాళ్లు నివేదించాలి. నిబంధనల ప్రకారం ఒకవేళ మ్యాచ్ నిషేధం వేయాల్సి ఉంటే అదే చేయాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలి' అని అన్నాడు.
నాలుగు టెస్టుల సిరిస్లో భాగంగా మిగతా రెండు టెస్టుల్లో కూడా ఏ జట్టు అయితే టాస్ గెలుస్తుందో ఆ జట్టే సిరిస్ను కైవసం చేసుకుంటుందని గంగూలీ జోస్యం చెప్పాడు. పూణెలో టెస్టు తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియాను 105 పరుగులకే ఆలౌట్ చేసింది.
దీంతో పూణె టెస్టులో 333 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక బెంగుళూరులో జరిగిన రెండో టెస్టు విషయానికి వస్తే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అనంతరం 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టు రాంచీలో మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది.