|
డీఆర్ఎస్ సమస్యకు త్వరగా పరిష్కారం
డీఆర్ఎస్ సమస్యకు త్వరగా పరిష్కారం లభించడంతో పాటు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు రాజీకి రావడంపై కోహ్లీ స్పందించాడు. ‘ఈ వివాదం నుంచి దృష్టి మరల్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎంతో పరిణితితో ప్రవర్తించారు. సామరస్యం దెబ్బతినకుండా వివాదాలు ఎదురైనప్పుడు గతంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోవడం చూశాం. మేం మిగతా రెండు టెస్టులపై దృష్టి పెట్టాలి. ఆటపై దృష్టి సారించేందుకు ఇదే అత్యుత్తమం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
|
కెరీర్లో ఇదే తొలిసారి కాదు
అయితే తన గురించి చర్చించుకోవడం కెరీర్లో ఇదే తొలిసారి కాదని కోహ్లీ పేర్కొన్నాడు. ‘నా గురించి చర్చించుకోవడం కెరీర్లో ఇదే తొలిసారి కాదు. అలాగే చివరి సారి కాదు. కెప్టెన్ అయ్యేందుకు అవసరమైన సరైన పనులెన్నో చేశాను. నిజాయతీతో కష్టపడి పనిచేసినంత కాలం ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు' అని కోహ్లీ స్పష్టం చేశాడు.
నేను ఎవ్వరినీ సవాల్ చేయడం లేదు
'ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయం ఉంటుంది. నేను ఎవ్వరినీ సవాల్ చేయడం లేదు. ఎవరైనా సవాల్ చేస్తే అది వారిష్టం. నా గురించి చెత్తగా మాట్లాడొద్దని బ్యానర్ పెట్టుకొని ప్రదర్శించను. ఇలాంటివి క్రికెట్ జర్నీలో ఓ భాగం' అని కోహ్లీ అన్నాడు.
ఆసీస్ మీడియా తనని టార్గెట్ చేయడంపై
ప్రస్తుత సిరిస్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మీడియా తనను టార్గెట్ చేసిందని వస్తున్న వార్తలపై కూడా కోహ్లీ స్పందించాడు. 'నిజం చెప్పాలంటే ఇది పెద్ద విషయం కాదు. ఈ సిరిస్కు ముందు నాపై ఫోకస్ పెట్టండి, నా గురించి మాట్లాడుకోండి, నా గురించి రాయండి అని చెప్పలేదు. అది నా చేతుల్లో లేదు. మైదానంలో ఏదైతే జరుగుతుందో అది మాత్రమే నా చేతుల్లో ఉంటుంది' అని కోహ్లీ అన్నాడు.
విమర్శ లేదా ప్రశంస అయినా
ఎవరైతే తన గురించి మాట్లాడుకుంటారో, చర్చించుకుంటారో అది వాళ్ల ఇష్టమని కోహ్లీ చెప్పాడు. అది విమర్శ లేదా ప్రశంస అయినా తనకు ఇష్టమేనని కోహ్లీ చెప్పాడు. ఈ విషయాలేమీ తనపై ప్రభావం చూపబోవని కోహ్లీ అన్నాడు. తన గురించి ఎవరు ఏం రాసుకుంటారనేది కూడా సంబంధం లేని విషయమని కోహ్లీ తెలిపాడు. అది వారి జాబ్ అని, తన పని తాను చేసుకుంటున్నట్లు కోహ్లీ చెప్పాడు.