హైదరాబాద్: ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఏకైక టెస్టుకు పరిశీలకుడిని నియమించాలన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. బీసీసీఐ బోర్డు జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టి భారత్-బంగ్లా టెస్టు మ్యాచ్కు పరిశీలకుడిగా వ్యవహరిస్తాడని అధికారిక ప్రకటన చేసింది.
హైదరాబాద్లో టెస్టు నిర్వహణకు హెచ్సీఏ చేస్తున్న ఏర్పాట్లతో పాటు మ్యాచ్ను రత్నాకర్ శెట్టి దగ్గరుండి పర్యవేక్షిస్తాడని పేర్కొంది. ఇక హెచ్సీఏ అకౌంట్లను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైతే బీసీసీఐ ఒక ఆర్థిక సలహాదారుడిని నియమించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసిన దానిపై కూడా బోర్డు స్పందించింది.
హైదరాబాద్ టెస్టు మ్యాచ్కు సంబంధించి వ్యయ, ఖర్చుల రికార్డులు సక్రమంగా నిర్వహించేలా బీసీసీఐ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంతోష్ రంగ్నేకర్ సలహాదారుగా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా, భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్ సజావుగా సాగేందుకు పరిశీలకుడిని నియమించాలని బీసీసీఐని సోమవారం హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ పంపిన పరిశీలకుడికి 2014 సెప్టెంబర్లో ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) కార్యవర్గం సహకారం అందించాలని స్పష్టంచేసింది. భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ నిర్వహణ ద్వారా సమకూరిన నిధులను హెచ్సీఏ బ్యాంకు ఖాతాలో జమచేయాలని తేల్చిచెప్పింది.
హెచ్సీఏ సారథ్య బాధ్యతల వ్యవహారంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నందున టెస్ట్ మ్యాచ్ నిర్వహణ కోసం ఓ పరిపాలకుడిని నియమిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ప్రముఖ న్యాయవాది, క్రికెట్ క్రీడాకారుడు గోవింద్రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిల్ను విచారించిన ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బీసీసీఐ నుంచి తన ప్రతినిధిని పంపే వరకు రత్నాకర్ శెట్టి ఆ బాధ్యతలను చూస్తారని ధర్మాసనం పేర్కొంది.