హైదరాబాద్: కటక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ధోనీ బౌల్డ్ అయితే అంపైర్ బౌండరీ ఇచ్చాడు. 42వ ఓవర్ చివరి బంతికి యువరాజ్ సింగ్ను ఇంగ్లాండ్ బౌలర్ వోక్స్ పెవిలియన్కు పంపాడు.
ఆ తర్వాత బౌలర్ ప్లంకెట్ వేసిన 43వ ఓవర్ మూడో బంతిని నోబాల్గా సంధించాడు. దానిని స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన ధోనీ రెండు పరుగులు చేశాడు. దీంతో మళ్లీ ధోనీ బ్యాటింగ్కు వచ్చాడు. నోబాల్ కావడంతో తర్వాతి బంతిని ధోని భారీ షాట్గా మలిచే ప్రయత్నంలో బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డయ్యాడు.
అయితే ఇది ఫ్రీ హిట్ కావడంతో అవుట్ ఇవ్వని అంపైర్ బౌండరీ ఇచ్చాడు. కాగా, క్రికెట్లో ఫ్రీ హిట్కు క్యాచ్, లేదా బౌల్డ్ అయితే అవుట్ ఇవ్వరు, స్టంప్ అవుట్ను మాత్రమే ఔట్గా పరిగణిస్తారు. దీంతో ధోనిని అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కోహ్లీ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 25 పరుగులకే ధావన్ (11), రాహుల్ (5), కోహ్లీ (8) వికెట్లును కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన యువరాజ్ ఇంగ్లాండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. క్రీజులో ఉన్నంత సేపు ఎలాంటి భావోద్వేగాలు చూపకుండా భారీ షాట్లతో అలరించాడు.
ఈ క్రమంలో 150 పరుగులు చేసిన యువరాజ్, ధోనీ సెంచరీ చేయగానే అవుటై పెవిలియన్కు చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కేదార్ జాదవ్ కేవలం 9 బంతులెదుర్కొని 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరుని పెంచే క్రమంలో 134 పరుగుల వద్ద అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డిక్ పాండ్య (19), రవీంద్ర జడేజా (16) భారీ షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లతో రాణించగా, ప్లంకెట్ రెండు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఇంగ్లాండ్కు 382 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.