హైదరాబాద్: కటక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో తన కెరీర్లోనే అత్యధిక పరుగులు 150 సాధించడం ఆనందంగా ఉందని టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. బ్యాటింగ్ ముగిసిన అనంతరం యువరాజ్ మీడియాతో మాట్లాడాడు.
కటక్ వన్డేలో తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. 'ఇంతకుముందు సెంచరీ ఎప్పుడు చేశానో గుర్తులేదు. బహుశా 2011 ప్రపంచ్ కప్లో అనుకుంటా' అని యువీ చెప్పాడు.ఆరంభం నుంచే అనవసరంగా ఆవేశపడకూడదని ముందుగానే నిర్ణయించుకున్నానని యువీ చెప్పాడు.
'దేశవాళీ క్రికెట్లో అలుపెరగని సాధన చేశాను. ఓ సందర్భంలో సంజయ్ బంగార్ (టీమిండియా బ్యాటింగ్ కోచ్)తో నా బ్యాటింగ్ శైలి, బంతిని ఎలా కొడుతున్నానో వివరించాను. భారీ స్కోరు చేస్తానని కూడా చెప్పాన'ని వెల్లడించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఈరోజుకి తాను కోరుకున్న విధంగా ఆడగలిగానని అన్నాడు.
మరో ఎండ్లో ఉన్న ధోని కూడా తనకు పూర్తి సహకారం అందించాడని చెప్పాడు. ధోని కూడా సెంచరీ చేయడం మరింత ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. ఎంతో అనుభవమున్న ఆటగాడిగా, విజయవంతమైన కెప్టెన్గా ప్రశంసలందుకున్న ధోని ఈ మ్యాచ్లో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించిందని యువీ అన్నాడు.
రెండో వన్డేలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. కటక్ వన్డేలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది. రెండో వన్డేలో ధోని 200 సిక్సర్లు మైలురాయిని అందుకున్నాడు. 48 ఓవర్లో ప్లంకెట్ను ధోని మూడు సిక్సర్లు కొట్టడంతో ఈ ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా మొత్తం 12 సిక్సర్లు కొట్టింది. ఇంగ్లాండ్పై సరికొత్త బ్యాటింగ్ రికార్డ్ నమోదు చేసింది. ఇంగ్లండ్పై వన్డేల్లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక మూడో అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. అంతకుముందు 2008లో ఇంగ్లాండ్పై టీమిండియా 387/5 చేయగా, 2015లో న్యూజిలాండ్ జట్టు 398/5 స్కోర్ నమోదు చేసింది.