చెన్నై: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్లో చివరిదైన ఈ టెస్టు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది.
ఈ టెస్టు మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు నల్ల బ్యాండ్లను ధరించి మ్యాచ్ ఆడనున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా ఈ విధంగా చేయనున్నారు.
ఈ మేరకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 6న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జయలలిత మృతికి నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల మోచేతి బ్యాండ్ ధరించి మ్యాచ్లో పాల్గొంటారని టీఎన్సీఏ పేర్కొంది.
మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు వంటివి నిర్వహించడం లేదని టీఎన్సీఏ అధికారి పీటీఐకి తెలిపారు. 'వర్ధా' తుఫాన్ ప్రభావం కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఐదో టెస్ట్ కోసం చెపాక్ మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్ సిబ్బంది తలమునకలై ఉన్నారు.
ఐదో టెస్టు: చెన్నై పిచ్ని బొగ్గులతో ఆరబెడుతున్నారు
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐదో టెస్టు మ్యాచ్ కోసం చిదంబరం స్టేడియం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సిద్ధం చేస్తోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పిచ్ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది బొగ్గును మండిస్తున్నారు. వర్దా తుపాను కారణంగా చిదంబరం స్టేడియంలోని పిచ్ బాగా తడిసిపోయింది. పిచ్పై ఉన్న తేమను తగ్గించడానికి గ్రౌండ్ సిబ్బంది సంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఎర్రగా కాలుతున్న బొగ్గులను ఇనుప ట్రేలలో పోసి వాటి కింద స్టంప్స్ను ఉంచి పిచ్పై అటూ ఇటూ తిప్పుతున్నారు. ఇలా చేయడం వల్ల మామూలుగా కంటే చాలా వేగంగా పిచ్ ఆరిపోయి, మ్యాచ్ కోసం అందుబాటులోకి వస్తుందని టీఎన్సీఏ పేర్కొంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా ఇప్పటికే ఇంగ్లాండ్పై 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.