హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మిగతా రెండు టెస్టులకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అజ్యింకె రహానే దూరమయ్యాడు. కుడి చేతి చూపుడు వేలు గాయం కారణంగా రహానేను టెస్టు సిరిస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ బుధవారం ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటించింది.
NEWS ALERT - @im_manishpandey replaces @ajinkyarahane88, @imShard come in as back up for @MdShami11 for 4th Test @Paytm #INDvENG pic.twitter.com/eFnCMZSfZj
— BCCI (@BCCI) December 7, 2016
బుధవారం వాంఖడె మైదానంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రహానే గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్తో జరగనున్న మిగతా రెండు టెస్టుల నుంచి బీసీసీఐ తప్పించింది. రహానే స్ధానంలో కర్ణాటకకు చెందిన బ్యాట్స్మెన్ మనీశ్ పాండేకు చోటు కల్పించించింది.
27 ఏళ్ల మనీశ్ పాండే భారత్ తరుపున 12 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లాడాడు. అయితే ఇప్పటవరకు అతడు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. మరోవైపు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి బ్యాకప్గా జట్టులో పేసర్ షర్దుల్ థాకూర్కు చోటు కల్పించారు.
నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ మెడికల్ టీమ్ రహానే గాయపడ్డాడని నిర్ధారించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంగ్లాండ్పై 2-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రాజ్కోట్లో జరిగిన టెస్టు డ్రాగా ముగియడంతో ఆ తర్వాత విశాఖ, మొహాలిలో జరిగిన టెస్టుల్లో భారత్ విజయం సాధించింది.