అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న కోహ్లీ
కెప్టెన్ విరాట్ కోహ్లీ గత భారత టీ20 కెప్టెన్లెవరూ నెలకొల్పని రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన అనంతరం తొలి టీ20 మ్యాచ్ ను ఇంగ్లాండ్తో గురవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో తొలి టీ20 మ్యాచ్ లో ఓడిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, అజింక్యా రహానేలకు సాధ్యం కాని ఈ రికార్డును కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం. ధోనీ తొలి టీ20 మ్యాచ్ లో ఫలితం తేలకపోవడం విశేషం.
భారత్పై ఇంగ్లాండ్ అద్భుత రికార్డు
తొలి టీ20 విజయంతో భారత్పై ఇంగ్లాండ్ అద్భుతమైన రికార్డుని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్పై ఇంగ్లాండ్ 6-3 రికార్డుని సొంతం చేసుకుంది. ఇండియాపై ఇప్పటి వరకు టీ20ల్లో ఆరుసార్లు ఏ జట్టూ విజయం సాధించలేదు. ఇంగ్లాండ్ తర్వాత భారత్పై అత్యధికంగా న్యూజిలాండ్ 5 సార్లు విజయం సాధించింది.
ఓపెనర్గా కోహ్లీ
టీ20ల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగడం ఇది మూడోసారి. అంతకముందు 2012లో న్యూజిలాండ్తో జరిగిన టీ20లో కోహ్లీ తొలిసారి ఓపెనర్గా దిగాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ 70 పరుగులు చేశాడు. కాన్పూర్ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్ మోయిన్ అలీ కెప్టెన్ కోహ్లీని 19 పరుగుల వద్ద పెవిలియన్కు చేర్చాడు.
మోర్గాన్
కాన్పూర్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. టీ20ల్లో1500 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్గా అవతరించాడు. మొత్తంగా చూస్తే 12వ బ్యాట్స్మెన్.
తొలి టీ20లో నిరాశ చెందిన బుమ్రా!
రెండు వరుస బంతుల్లో రెండు సార్లు ఒక ఆటగాడిని క్లీన్ బౌల్డ్ చేసినా ఆ ఆటగాడు అవుట్ కాలేదంటే ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనుభవించాడు. ఇంగ్లాండ్తో కాన్పూర్లో జరిగిన తొలి టీ20లో 17వ ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా ఐదో బంతికి జో రూట్ను బౌల్డ్ చేశాడు. దాంతో, టీమిండియా ఆటగాళ్లంతా బుమ్రాను అభినందించారు. మ్యాచ్ టర్న్ అయిందని అంతా భావించారు. అయితే, అంపైర్ దానిని రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ దానిని తరచి చూసి, నోబాల్గా ప్రకటించారు. దీంతో అవుట్ సంగతటుంచి, ఫ్రీ హిట్ వచ్చింది. దీంతో తరువాత బంతిని యార్కర్గా సంధించిన బుమ్రా మళ్లీ రూట్ను బౌల్డ్ చేశాడు. ఇలా వరుస రెండు బంతుల్లో రెండు సార్లు అవుట్ చేసినా రూట్ అవుట్ కాకపోవడంతో బుమ్రా నిరాశపడ్డాడు.