హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య విశాఖపట్నంలో ఈనెల 29న జరగనున్న ఐదో వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఐదో వన్డే కోసం ఈనెల 25 నుంచి టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో నగరంలోని 20 ఈ సేవ కేంద్రాల్లో మంగళవారం విక్రయానికి ఉంచిన టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు క్యూకట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొత్తం 12 వేల టికెట్లకు తొలిరోజైన ఒక్క మంగళవారమే 10,500 టికెట్లు అమ్ముడయ్యాయి. అరగంటలోనే పదివేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్మడైనట్లు అధికారులు అధికారిక ప్రకటన చేశారు. వెయ్యి రూపాయల టికెట్లు 5,900 విక్రయించగా... రూ.1500, రూ.2 వేల టికెట్లు కొన్ని మిగిలాయని తెలిపారు.
నగరంలోని 20 ఈసేవా కేంద్రాల్లో మంగళవారం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. రూ. 400 ధరగా నిర్ణయించిన రెండు వేల టికెట్లు మొదటి అరగంటలోనే అయిపోయాయి. బుధవారం నాటికి ఇంకా 1500 టికెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రూ. 5000 టిక్కెట్లు వంద, రూ. 3000 టిక్కెట్లు 150 అమ్ముడయ్యాయి.
ఇదిలా ఉంటే విశాఖ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదో వన్డేకి తుపాను గండం పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కోస్తా దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.