హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్గా, ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియా టోర్నీని చెత్తగా ఆరంభించినా, తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో పాకిస్థాన్ పైనల్కు అర్హత సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007 వరల్డ్కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇండో-పాక్ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
2009 టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ఐసీసీ ఈవెంట్లో తొలిసారి పాకిస్థాన్ పైనల్కు చేరంది ఛాంపియన్స్ ట్రోఫీలోనే. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బలంగా కోరుకుంటోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో పాక్పై భారత్ 13-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది.
ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నా... సగటు భారతీయుడిలో ఏ మూలనో కాస్తంత టెన్షన్. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడాక వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లను ఓడించి పాకిస్థాన్ సెమీస్కు చేరింది. ఇక సెమీస్లో టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను మట్టి కరిపించి ఫైనల్కు అర్హత సాధించింది.
ఐసీసీ టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్ విశేషాలు:
* పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.
* టీమిండియా మాత్రం ఇది నాలుగో ఫైనల్.
* ఈసారి గెలిస్తే ఇది మూడో టోర్నీ అవుతుంది. 2002, 2013లో టీమిండియా విజేతగా నిలిచింది.
* ప్రస్తుత టోర్నీలో 11-40 మధ్య ఓవర్లలో టీమిండియా 19 వికెట్లు తీసింది. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పాకిస్థాన్ 18 వికెట్లతో రెండో స్థానంలో ఉంది.
* కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ బౌలర్లు తీసిన వికెట్ల సంఖ్య 37. ఇదే ఆ జట్టుదే అత్యుత్తమ ప్రదర్శన.
* 2011 వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో భారత్ గెలుపోటముల రికార్డు 34-7గా ఉంది. మరే జట్టుకూ ఇంత గొప్ప రికార్డు లేదు.
పిచ్, వాతావరణం:
* పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కోసం ఉపయోగిస్తున్న కొత్త పిచ్ పొడిగా కనిపిస్తోంది.
* బ్యాటింగ్కు అనుకూలం. 300లకు పైగా స్కోరు నమోదు కావొచ్చు.
* వాతావరణం కాస్త మేఘావృతంగా ఉంది. కానీ ఎక్కువశాతం పొడిగానే ఉండే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంది.
జట్ల వివరాలు:
టీమిండియా: కోహ్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్, యువరాజ్, ధోనీ, కేదార్, హార్దిక్, జడేజా, అశ్విన్ / ఉమేశ్, భువనేశ్వర్, బుమ్రా.
పాకిస్థాన్: సర్ఫరాజ్ (కెప్టెన్), అజర్ అలీ, జమాన్, ఆజమ్, హఫీజ్, షోయబ్, వసీమ్, ఆమిర్, షాదాబ్, హసన్ అలీ, జునైద్.