హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు శనివారం ప్రారంభం కానుంది. ఈ టెస్టులో కోహ్లీసేన విజయం సాధిస్తే సరికొత్త రికార్డుని సాధిస్తుంది. పల్లెకెలె వేదికగా జరిగే ఈ మూడో టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తే విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా నిలుస్తుంది.
భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీసేన తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో టీమిండియా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 304 పరుగుల తేడాతో విజయం సాధించగా, కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సిరిస్లో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది.
మూడో టెస్టులో రిజర్వ్ బెంచ్ను పరీక్షించాలని కోచ్తో పాటు కెప్టెన్ కోహ్లీ చూస్తున్నాడు. ఇప్పటికే సస్పెన్షన్ కారణంగా రవీంద్ర జడేజా మూడో టెస్టుకు దూరం కాగా, అతని స్థానంలో స్సిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రధాన స్పిన్నర్ అశ్విన్కు జతగా కుల్దీప్ స్పిన్ విభాగాన్ని పంచుకునే అవకాశాలు ఉన్నాయి.
జట్లు అంచనా:
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
శ్రీలంక: దినేష్ చండీమాల్(కెప్టెన్), దిముత్ కరుణరత్నే,ఉపుల్ తరంగా, కుశాల్ మెండిస్, మాథ్యూస్, నిరోషాన్ డిక్ వెల్లా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, దిల్రువాన్ పెరీరా, రంగనా హెరాత్, మలిందా పుష్పకుమార, నువాన్ ప్రదీప్