హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్పై ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో శిఖర్ ధావన్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ధావన్ 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు.
అయితే 55వ ఓవర్లో ప్రదీప్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్ 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో ధావన్ తొలి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని మాత్రం నమోదు చేయగలిగాడు.
గతంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును ధావన్ తాజాగా అధిగమించాడు. ధావన్ మెరుపు ఇన్నింగ్స్పై ఆస్ట్రేలియా ఓపెనర్, ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్, చాలా చక్కగా ఆడాడంటూ ట్విట్టర్లో కొనియాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్లు సభ్యులుగా ఉన్నారు. టెస్టుల్లో ధావన్కి ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. లంచ్ విరామ సమయానికి 64 పరుగులతో ఉన్న ధావన్ లంచ్ విరామం అనంతరం మరింత జోరు పెంచాడు. బౌండరీల వర్షం కురిపించాడు. లంచ్ తర్వాత అరగంటలోపే సెంచరీ పూర్తి చేశాడు.
Well played to @SDhawan25 awesome to see him go well. Love Sri Lanka what a place.
— David Warner (@davidwarner31) 26 July 2017
గాలేలో శ్రీలంకపై 2015లో ధావన్ సెంచరీ చేయడం గమనార్హం. మరోవైపు ఈ టెస్టు ద్వారా ధావన్ ఓ అరుదైన రికార్డుని నమోదు చేశాడు. ఒక సెషన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. టెస్టుల్లో లంచ్ బ్రేక్, టీ విరామం మధ్య 126 పరుగులు చేసి ధావన్ ఓ రికార్డు నెలకొల్పాడు.
అంతకు ముందు 2009లో ముంబైలో శ్రీలంకపై వీరేంద్ర సెహ్వాగ్ 133 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్ధానంలో వీవీఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు. 2000 సంవత్సరంలో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన టెస్టులో లక్ష్మణ్ ఒకే సెషన్లో 121 పరుగులు చేశాడు.