హైదరాబాద్: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే, టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం ధావన్ని ఆటపట్టించాడు.
శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకరిని మరొకరు ఎప్పుడూ ఆట పట్టించుకుంటూ ఉంటారు. తాజాగా లంక సిరిస్కు ముందు ధావన్ చేసిన పనికి యువీ ట్విట్టర్లో ఆటపట్టించాడు.
శ్రీలంకతో సిరిస్కు ముందు టీమిండియా జట్టు సభ్యులు కొత్త లోగోలతో కూడిన కిట్లను బీసీసీఐ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, పుజారా, శిఖర్ ధావన్ కొత్త జెర్సీలు ధరించి ఫొటోషూట్కు హాజరయ్యారు.
ఈ ఫోటో షూట్లో ధావన్ చెప్పులు వేసుకోని ఫొటోకు పోజులిచ్చాడు. షూట్ అనంతరం దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో షేర్ చేసింది. అందులో ధావన్ చెప్పులు వేసుకుని ఉండటాన్ని గుర్తించిన యువీ దానినే ఎత్తి చూపాడు.
Jatt ji jutey ta pahlo 🤣 @SDhawan25
— yuvraj singh (@YUVSTRONG12) 25 July 2017
అందుకు 'నా పూర్తి చిత్రం సోషల్ మీడియాలో వస్తుందనుకోలేదు. అయినా ఫర్వాలేదులే!' అంటూ శిఖర్ ధావన్ పంజాబీ స్టయిల్లో యువరాజ్ సింగ్కు బదులిచ్చాడు. ఇదిలా ఉంటే, లంకతో జరుగుతున్న తొలి టెస్టులో ధావన్ బుధవారం ఓ అరుదైన ఘనత సాధించాడు.
190 పరుగుల వద్ద పెవిలియన్కు చేరి డబుల్ సెంచరీ మిస్ అయిన ధావన్ టెస్టు క్రికెట్లో ఓ అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ధావన్కి ఇది నాలుగో సెంచరీ. ఈ మ్యాచ్లో 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు.
55వ ఓవర్లో ప్రదీప్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్ (190) పరుగుల వద్ద మాథ్యూస్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఒక సెషన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. టెస్టుల్లో లంచ్ బ్రేక్, టీ విరామం మధ్య 126 పరుగులు చేసి ధావన్ ఓ రికార్డు నెలకొల్పాడు.
అంతకు ముందు 2009లో ముంబైలో శ్రీలంకపై వీరేంద్ర సెహ్వాగ్ 133 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్ధానంలో వీవీఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు. 2000 సంవత్సరంలో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన టెస్టులో లక్ష్మణ్ ఒకే సెషన్లో 121 పరుగులు చేశాడు.