హైదరాబాద్: వెస్టిండిస్ జట్టుతో తొలి వన్డే జరిగే నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి యువ ఆటగాడు రిషబ్ పంత్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
వెస్టిండిస్ పర్యటన కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో 19 ఏళ్ల రిషబ్ పంత్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన నెట్ ప్రాక్టీస్లో టీమిండియా పాల్గొంది. ఈ క్రమంలో యువ ఆటాగాడు రిషబ్ పంత్కు ధోనీ పలు సూచనలు చేశాడు.
గత 12 ఏళ్లుగా టీమిండియా వికెట్ కీపర్గా సేవలందిస్తున్న ధోని ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించాడు. రాంచీకి చెందిన ధోని ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 571 క్యాచ్లు, 155 స్టంపింగ్స్ చేశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వన్డేల్లో ధోని 50.77 యావరేజిని కలిగి ఉన్నాడు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోను బీసీసీఐ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 'వెస్టిండీస్తో తొలి వన్డేకు ముందు పంత్తో ధోని చర్చలు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. భారత కాలమానం ప్రకారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం సాయత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే తొలి వన్డే తుది జట్టులో రిషబ్ పంత్కు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుపున ఆడుతున్న పంత్ వికెట్ కీపర్గా సేవలు అందించాడు. ఐపీఎల్లో 14 మ్యాచులాడిన పంత్ 366పరుగులు సాధించాడు.
వెస్టిండిస్ పర్యటన అనంతరం కోహ్లీసేన శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని తప్పించి వారి స్ధానంలో రిషబ్పంత్, కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకుంది.