మొహాలి: క్రికెట్లో ఫామ్లో ఉన్న ఆటగాడి క్యాచ్ మిస్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో మొహాలిలో న్యూజిలాండ్ జట్టుకు తెలిసొచ్చింది. రోహిత్ శర్మ రూపంలో 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ (134 బంతుల్లో 154; 16 ఫోర్లు, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో టేలర్ మిస్ చేయడంతో కివీస్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాస్ టేలర్ ఆ క్యాచ్ పట్టి ఉంటే మూడో వన్డేలో ఆట స్వరూపమే మారిపోయి ఉండేది. మూడో వన్డేలో కోహ్లీ ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే అది ముందుగా కివీస్ ఆటగాడు రాస్ టేలర్కే చెప్పుకోవాలి. కోహ్లీకి రెండు పరుగుల వద్ద ఇచ్చిన ఆ లైఫై భారత్ గెలుపుకు బాటలు వేసింది.
Photos : India NZ 3rd ODI
కివీస్ బౌలర్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో రాస్ టేలర్ వదిలేశాడు. ఈ క్యాచ్తో ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్న కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగి న్యూజిలాండ్కు మ్యాచ్ని దూరం చేశాడు. అంతేకాదు కీలక ఆటగాడి క్యాచ్ మిస్ చేస్తే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో టేలర్కు తెలిసేలా చేశాడు.
ఆదివారం మొహాలిలో జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమ్ఇండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది.
3వ వన్డే: 26వ సెంచరీ చేసిన కోహ్లీ, కివీస్పై భారత్ ఘన విజయం
286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెన్రీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ రహానే (5) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (13) సౌథీ బౌలింగ్లో పెవిలియన్ బాటపట్టడంతో 41 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత కష్టాల్లో పడింది.
ఈ దశలో కోహ్లీకి జతకలిసిన ధోనీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. కోహ్లీ, ధోనీ తొలుత సింగిల్స్కే ప్రాధాన్యమిచ్చారు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ రెచ్చిపోయారు. సాంట్నర్ బౌలింగ్లో అద్భుతమైన సిక్స్ సాధించిన ధోనీ వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్లో వేగం పుంజుకుంది. కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ధోని కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత నీషమ్ బౌలింగ్లోనూ మరో సిక్సర్ సాధించాడు. ఈ షాట్తో భారత తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన సచిన్ (195) రికార్డును మహీ (196) అధిగమించాడు.
ఆ తర్వాత ఇద్దరూ ధాటిగా ఆడుతూ భారత స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. అయితే ఇన్నింగ్స్ 36వ ఓవర్లో ధోనీని అవుట్ చేసిన హెన్రీ భారత్కు షాకిచ్చాడు. ఈ ఓవర్లో ఫోర్ బాది జోరుమీదున్న ధోనీ.. ఆ వెంటనే మరో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. దీంతో 151 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
అయితే క్రీజులో కుదురుకున్న కోహ్లీ.. మనీష్ పాండేతో కలిసి భారత్కు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే 104 బంతుల్లోనే కెరీర్లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన తరుణంలో హెన్రీ బౌలింగ్లో 4, 2, 4, 6, 2, 4తో రెచ్చిపోయిన కోహ్లీ 133 బంతుల్లోనే 150 రన్స్ చేశాడు.
ఈ క్రమంలో కెరీర్లో రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. ఆ తర్వాత మనీష్ ఫోర్తో విన్నింగ్ షాట్ కొట్టాడు. దీంతో భారత్ 48.2 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది.