హైదరాబాద్: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా... టోర్నీలో ప్రదర్శనపై భారత మహిళా జట్టు సంతృప్తిగా ఉన్నట్లు ఫాస్ట్ బౌలర్ ఝలన్ గోస్వామి వెల్లడించింది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఫైనల్లో ఝలన్ గోస్వామి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత మహిళల జట్టుకు ఉందని పేసర్ గోస్వామి అభిప్రాయపడింది.
'టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మా జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. తొలి మ్యాచ్ నుంచే మా బలాలను మేము విశ్వసిస్తూ.. గెలుపు కోసం శాయశక్తులా పోరాడాం. తొలి మ్యాచ్లోనే ఇంగ్లండ్ను ఓడించిన అనంతరం మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది' అని అమె తెలిపింది.
'జట్టుగా సమష్టి పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందని మేం నమ్మాం. ఈ ప్రయాణాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. దురదృష్టవశాత్తు కప్ గెలవలేకపోయాం. కానీ.. టోర్నీలో మా ప్రదర్శనపై జట్టు అంతా సంతృప్తిగా ఉంది. ఒక్క ఫైనల్ తప్ప మా ఆటతీరు గర్వించే స్థాయిలోనే ఉంది' అని గోస్వామి పేర్కొంది.
ఉమెన్ వరల్డ్ కప్: విజేతగా ఇంగ్లాండ్, పోరాడి ఓడిన మిథాలీ సేన
వన్డేల్లో 195 వికెట్లు తీసిన గోస్వామి, వరల్డ్ కప్ మ్యాచ్ల్లో 36 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్ధానంలో ఉంది. 'ఫైనల్లో భారత్కి తొందరగా వికెట్ దక్కలేదు. పిచ్ పేస్ బౌలింగ్కి తొలుత సహకరించలేదు. దీంతో లయ అందుకునేందుకు కొంచెం సమయం తీసుకోవాల్సి వచ్చింది. నా వరకు ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నించా' అని పేర్కొంది.
ఆదివారం భారత్తో జరిగిన ఫైనల్లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాట్స్ ఉమెన్లలో ఓపెనర్ పూనమ్ రౌత్(86) టాప్ స్కోరర్గా నిలిచింది.
స్మృతి మిథాలీ రాజ్ 17, హర్మన్ ప్రీత్ కౌర్ 51, రౌత్ 86, వేద కృష్ణమూర్తి 35, పాండే 4, దీప్తీ శర్మ 14 పరుగులు చేయగా మందాన, స్మృతీ వర్మ, గైక్వాడ్ డకౌట్గా వెనుదిరిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ష్రుబ్షోలే 4/45తో భారత వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంగ్లాండ్కిది నాలుగో వరల్డ్కప్ కావడం విశేషం.