న్యూఢిల్లీ: ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ బీసీసీఐ వ్యతిరేకంగా తీసుకున్న ఓ నిర్ణయం టీమిండియాకు తలనొప్పిగా మారింది. అగ్రిమెంట్ ప్రకారం ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు పాకిస్థాన్తో భారత మహిళల క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా పాకిస్థాన్ జట్టుతో భారత మహిళల జట్టు ఈ ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. దాంతో సిరిస్ ఆడనందుకు గాను భారత మహిళల క్రికెట్ జట్టుకు ఐసీసీ మ్యాచ్ పాయింట్లతో కోత విధించింది.
మొత్తం మూడు మ్యాచ్లకు గాను ఒక్కో మ్యాచ్కి 2 పాయింట్లు చొప్పున 6 పాయింట్లను ఐసీసీ కోత పెట్టింది. అంతేకాదు 50 ఓవర్లకు గాను జీరో పరుగుల ప్రకారం రన్ రేట్ను కూడా సవరిస్తామని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయం బీసీసీఐకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫీలో కూడా భారత పురుషుల జట్టు పాకిస్థాన్తో ఆడే అవకాశం అనుమానంగానే కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రూల్స్, నిబంధనలు పేరుతో భారత మహిళల జట్టుని ఐసీసీ టార్గెట్గా ఎంచుకుంది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా ద్వైపాక్షిక సిరీస్లు ఆడాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరని, అది ఐసీసీ ఛైర్మన్కి కూడా బాగా తెలుసని బీసీసీఐ తాజా వివాదంపై కాస్తంత ఘాటగానే స్పందించింది.
'పాకిస్థాన్ దాడుల్లో భారత సైనికులు అమరులవుతోన్న సంగతి ఐసీసీకి తెలుసు. పాకిస్థాన్తో క్రికెట్ ఆడాలన్న కోరిక చచ్చిపోయింది. ప్రభుత్వ అనుమతి కావాలని ఐసీసీ ఛైర్మన్కు బాగా తెలుసు' అని బీసీసీఐ సీనియర్ అధికారి పీటీఐకి చెప్పారు.
'భారత మహిళల జట్టు పాకిస్థాన్తో ఆడుతుండగా పురుషుల జట్టు ఆడితే వచ్చే నష్టమేంటి? అని ప్రశ్నించాలనే ఉద్దేశంతో పాయింట్లను కోత విధించింది. ఇది అస్సలు జరగదు. ఐసీసీ తిరిగి సరైన నిర్ణయం తోసుకోకుంటే పురుషులతో పాటు మహిళల జట్టూ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడదు' అని బీసీసీఐ కాస్తంత గట్టిగానే హెచ్చరించింది.