హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్లో భాగంగా చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడటంపై సందిగ్థత నెలకొంది. మూడో వన్డేలో భాగంగా శుక్రవారం టీమిండియా నగరానికి వచ్చింది. జట్టుతో పాటు నగరానికి వచ్చిన ధావన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే కోల్కతాలోని అపోలో గ్లెన్ ఈగల్స్ హాస్పిటల్స్కు వెళ్లాడు.
దీంతో ధావన్కి గాయం తిరగబెట్టడంతో ఆసుపత్రికి వచ్చాడా? లేక సాధారణ పరీక్షల కోసం వచ్చాడా అన్న విషయాన్ని తాము అప్పుడే నిర్థారించలేమని, అయితే ధావన్ ప్రస్తుతం తమ దగ్గరే ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్లో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా ధావన్కు కుడి చేతి బొటన వేలికి గాయమైంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో ఆదివారం జరగనున్న మూడో వన్డేకు ధావన్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. దీంతో ధావన్కు విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఇటీవల కాలంలో ధావన్ ఆశించిన స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. యువ క్రికెటర్లు సత్తా చాటుతుంటే ధావన్ మాత్రం పేలవమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా ధావన్ పూణెలో జరిగిన తొలి వన్డేలో ఒకే ఒక్క పరుగు చేయగా, కటక్ లో జరిగిన రెండో వన్డేలో 11 పరుగులు మాత్రమే చేశాడు.