హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్ 1 మ్యాచ్లో ముంబైకి పూణె గట్టి షాకిచ్చింది. వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పూణె 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్లోనూ సమష్టిగా రాణించిన పూణె ఈ సీజన్లో ముంబైపై మరో విజయాన్ని నమోదు చేసింది. లీగ్ దశలో రెండు సార్లు పుణె చేతిలో ఓటమి పాలైన ముంబైకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.
ముంబై విజయ లక్ష్యం 163
వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న క్వాలిఫెయర్-1 మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ బ్యాట్స్మెన్ తడబడి నిలబడ్డారు. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4x4, 2x6), రహానే (43 బంతుల్లో 56; 5x4, 1x6), అర్ధ సెంచరీలు చేయడంతో పూణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
దీంతో ముంబై ఇండియన్స్కు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పుణెని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని తొలి ఓవర్లోనే డకౌట్ చేసి మెక్లనగాన్ పుణెకి షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్స్మిత్(1)ని రెండో ఓవర్లో మలింగ అవుట్ చేయడంతో పూణె ఒత్తిడిలో పడింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రహానే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మనోజ్ తివారీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్కి 80 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన రహానే.. కర్ణశర్మ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్ల)తో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్లో ధోని రెండు సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. మనోజ్ తివారీ కూడా ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో పుణె ఏకంగా 26 పరుగులు సాధించింది.
చివరి ఓవర్ వేసిన బుమ్రాపై కూడా ధోని విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన ధోని 15 పరుగులు రాబట్టాడు. దీంతో పూణె నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో మెక్లనగాన్, మలింగ, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా క్వాలిఫయర్-1 మ్యాచ్లో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న మెక్లెనగన్, మలింగ, బుమ్రా, పార్థివ్ తుదిజట్టులో చోటు కల్పించారు. ఇక పూణె జట్టులో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ స్థానంలో ఫెర్గూసన్ను తీసుకొన్నట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. ఈ సీజన్లో ముంబైకి నాలుగు పరాజయాలు మాత్రమే ఎదురుకాగా ఇందులో రెండు సార్లు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ చేతిలోనే ఓటమి పాలైంది.
ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టిస్తుందా?: చరిత్ర ఏం చెబుతోంది
దీంతో ఈసారి ఎలాగైనా పూణెపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఈ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ బెర్తు దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై భావిస్తోంది. ఇక తొలిసారి ప్లేఆఫ్కి చేరిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఐపీఎల్ టైటిల్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి చేరనుండగా.. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో తలపడుతుంది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
పార్ధీవ్ పటేల్, కిరోన్ పొల్లార్డ్, హార్ధిక్ పాండ్యా, కర్ణ్ శర్మ, అంబటి రాయుడు, మెక్లెనగన్, లసిత్ మలింగ, జాస్ప్రీత్ బుమ్రా, సిమన్స్, రోహిత్ శర్మ,
రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
రహానే, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్, మనోజ్ తివారీ, ఎంఎస్ ధోనీ, డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గుసన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, ఆడమ్ జంపా
Qualifier 1. Mumbai Indians win the toss and elect to field https://t.co/1feDgCOBRy #MIvRPS
— IndianPremierLeague (@IPL) May 16, 2017
#IPL Qualifier 1 - The teams have arrived at Wankhede #MIvRPS pic.twitter.com/aka3JexBA3
— IndianPremierLeague (@IPL) May 16, 2017