పూణె: కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై బుధవారం జరిగిన ఐపియల్ మ్యాచులో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ దుమ్మురేపాడు. అతనికి మాయాంక్ అగర్వాల్ కూడా తోడు కావడంతో పంజాబ్పై ఢిల్లీ విజయం సాధించింది. యువరాజ్ సింగ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.
సెహ్వాగ్ (47), వృద్ధిమాన్ సాహా (39) రాణించడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్ 3, డుమినీ 2 వికెట్లు పడగొట్టగా, మాథ్యూస్, మిశ్రా చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత 166 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మయాంక్ అగర్వాల్ (48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) అర్ధ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడింది. ఆరంభంలోనే ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ (6)ను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు. తర్వాత కెప్టెన్ డుమినీ (21)ని అక్షర్ పటేల్ మెరుపు వేగంతో రనౌట్ చేశాడు.
అయితే, ఢిల్లీ 53 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో యువీ-అగర్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో యువీ 33, అగర్వాల్ 37 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. వీరిద్దరూ 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో గెలుపు సులువైంది. అయితే అనురీత్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో యువీ, అగర్వాల్ అవుటయ్యారు. ఇక ఆఖరి ఓవర్లో మాథ్యూస్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్కు మెరుపు ఆరంభం లభించింది. వెటరన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మురళీ విజయ్ ఫోర్, సిక్సర్ కొట్టి వేగం పెంచడానికి చేసిన ప్రయత్నంలో స్వల్ప స్కోరుకే మాథ్యూస్ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఈ దశలో సెహ్వాగ్తో సాహా జతకట్టాడు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే 11 పరుగుల తేడాతో వీరిద్దరూ అవుటయ్యారు.
పంజాబ్ స్కోరు 15 ఓవర్లలో 115/3. క్రీజులో మాక్స్వెల్ ఉండడంతో భారీ స్కోరు ఖాయమనుకున్నారు. అయితే తాహిర్ వేసిన 16వ ఓవర్లో మాక్స్వెల్ (15) రెండు సిక్సర్లు బాది చివరి బంతికి అవుటయ్యాడు. డేవిడ్ మిల్లర్ (5) కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. చివరలో కెప్టెన్ బెయిలీ (19), అక్షర్ పటేల్ (13) ప్రదర్శనతో జట్టు 160 పరుగులు దాటింది. చివరి ఓవర్లో వీరిద్దరినీ తాహిర్ అవుట్ చేశాడు.