ముంబై: దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టులో మహారాష్ట్ర, ముంబై క్రికెట్ అసోషియేషన్ సంఘాలకు చుక్కెదురైంది. మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
దీంతో మహారాష్ట్రలో మే 1 నుంచి జరిగే ఐపీఎల్ మ్యాచ్లు వేరే రాష్ట్రాలకు తరలిపోనున్నాయి. కరువు, నీటి కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిలో 30లోపు జరిగే 6 మ్యాచ్లకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది.
ఆ తర్వాత జరిగే 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ఆ తర్వాత ఒక మ్యాచ్ను నాగ్పూర్లో నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది.
దీంతో మిగతా 12 మ్యాచ్లను వేరే రాష్ట్రాలకు తరలించాలని సూచించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ నిరాశే ఎదురైంది.