హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 9వ ఎడిషన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సేవలను రెండు వారాల పాటు ఆ జట్టు కోల్పోనుంది.
ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా మార్చి 27న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా మార్చి 31న ముంబైలోని వాంఖడే మైదానంలో వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్కు కూడా దూరమయ్యాడు.
అయితే యువీ ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, పూర్తిగా కోలుకుని జట్టులో చేరడానికి ఇంకా రెండు వారాల సమయం పడుతుందని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ బుధవారం ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలం పాటలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ యువీని రూ. 7 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసింది.
ఆల్ రౌండర్ యవరాజ్ సింగ్ను అంత ఖరీదు పెట్టి కొనుగోలు చేయడాన్ని జట్టు కోచ్ టామ్ మూడీ సమర్ధించుకున్నారు. యువీ వల్ల మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటుంది పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ బలంగా ఉండేందుకు యువీతో పాటు దీపక్ హుడాను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 9వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు జరగనుంది. ఏప్రిల్ 12వ తేదీన బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో సన్రైజర్స్ ప్రారంభ మ్యాచ్గా తలపడనుంది.
ఐపీఎల్లో సగం మ్యాచ్లను మిస్ కానున్న మలింగ
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఇది గట్టి దెబ్బే. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన బౌలరైన లతీష్ మలింగ ఐపీఎల్లో సగం మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ విషయంపై జట్టు కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం జట్టులో లతీష్ మలింగ లేడని అన్నారు. గాయం కారణంగా టోర్నీలో సగం మ్యాచ్లకు దూరం కావొచ్చని పేర్కొన్నాడు.