బెంగళూరు: ఐపీఎల్ 9లో ఇంటి దారి పడుతుందని తొలుత భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చి, నాకౌట్కు చేరింది. బెంగళూరు నాకౌట్ చేరడంలో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రనే చాలా ఉంది. కోహ్లీ ఆద్యంతం అద్భుతంగా రాణించాడు.
ఐపీఎల్ ప్రారంభం నాటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధారణంగానే ఫేవరేట్. కానీ ఐదు మ్యాచ్ల తర్వాత బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్ధానానికి దిగజారింది. కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్, షేన్ వాట్సన్ వంటి భీకరమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ తొలుత బెంగళూరు ఆశించిన మేర రాణించలేదు.
మరో విషయమేంటే కోహ్లీ రాణించినప్పటికీ బెంగళూరు చివరి స్థానాల్లో ఉండిపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి మారిపోయింది. జట్టు వ్యూహాలు మార్చారు. బౌలర్ల పైన భారం వేయవద్దని నిర్ణయించుకున్నారు. ఏదైనా పిచ్ పైన 150 పరుగులు చేయగలిగే చోట 170 పరుగులు చేయడం ద్వారా గెలవవచ్చునని నిర్ణయించారు.
దీంతో జట్టులో కీలక ఆటగాళ్లు గేల్, కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్ వేగంగా.. నిలకడగా పరుగులు రాబట్టే బాధ్యతను భుజాన వేసుకున్నారు. దీంతో విజయానికి అవసరమైన పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేయడం ప్రారంభించారు. టాస్ గెలిస్తే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించారు. ఇలా వ్యూహాలు ఫలితాన్ని ఇచ్చాయి. దీనికి టాస్ కూడా కలిసి రావడంతో టోర్నీలో నాకౌట్కు చేరే అవకాశం లేదని భావించిన బెంగళూరు టాప్ 2గా నిలిచింది. అంతేకాదు, బ్యాటింగులో కోహ్లీ తొలి నుంచి సత్తా చాటాడు. కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు, హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొట్టాడు.
కోహ్లీపై ప్రశంసల జల్లు
రలహ్లీపై టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లీ అద్భుత ఫామ్ భారత క్రికెట్కు మేలు చేకూరుస్తుందన్నాడు. ఐపీఎల్లో తాజా సీజన్లో విరాట్ ఇప్పటికే నాలుగు శతకాలు బాది భీకర ఫామ్లో ఉన్నాడు.
అతడు ఇలాగే చెలరేగి ఆడితే భారత క్రికెట్కు సేవ చేసిన వాడవుతాడని, అందరూ అతడిని ప్రశంసిస్తూనే ఉంటారన్నాడు. బెంగళూరు కోచ్ ట్రెంట్ వుడ్హిల్ కూడా కోహ్లీ పైన ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే కోహ్లీ బెస్ట్ స్పోర్ట్స్మెన్ అన్నాడు.