చిన్నప్పటి నుంచే పలు టోర్నీల్లో సత్తా
మాసాబ్ ట్యాంక్ దర్గా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ అయిన మహ్మద్ గౌస్, షాభానాబేగం దంపతుల పెద్ద కొడుకు సిరాజ్. కుటుంబ పోషణకు సిరాజ్ తండ్రి సంపాదన సరిపోకపోవడంతో తల్లి షబానా బేగం కూడా పనిచేసేది. ఏడేళ్ల వయసు నుంచే క్రికెట్పై దృష్టి సారించిన సిరాజ్ పలు టోర్నమెంట్లలో తన సత్తా చాటాడు.
2010 నుంచి హైదరాబాద్ రంజీ జట్టుకు
2010 నుంచి సిరాజ్ హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్నాడు. 9 మ్యాచ్ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ రంజీ సీజన్ భాగంగా నిర్వహించిన టి20 చాంపియన్షిప్లో జరిగిన లీగ్లో మొత్తం పది మ్యాచ్లు అడి 16 వికెట్లు తీసుకుని అందరిని అకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియాకు కూడా ఎంపికయ్యాడు.
ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్
అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఇటీవల ఆస్ట్రేలియాతో మూడురోజుల మ్యాచ్ కోసం ఇండియా ఏ జట్టులో కూడా చోటు కల్పించారు. దేశవాళీ టోర్నీల్లో అతని ప్రదర్శనే ఇప్పుడు ఐపీఎల్లో అవకాశం వచ్చేలా చేసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్ వేలం అనంతరం సిరాజ్ మాట్లాడుతూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తనకు స్థానం దక్కటం సంతోషంగా ఉందన్నాడు.
వేలంలో రూ. 2.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు
అయితే వేలంలో తనకు రూ. 2.6 కోట్ల ధర పలుకుతుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టులో ఆడాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని సిరాజ్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలంలో సిరాజ్
పెద్ద మొత్తంలో అమ్ముడు పోవడంతో అతడి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.
కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా మారిన సిరాజ్ ఇల్లు
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రాకతో సిరాజ్ ఇల్లు సందడిగా మారింది. ‘వేలంలో ఏదో ఒక ఫ్రాంచైజీ నన్ను తీసుకుంటుందని అనుకున్నా. కానీ రూ. 2.6 కోట్ల ధర పలుకుతుందని అస్సలు ఊహించలేదు. నా జీవితంలో గొప్ప సంఘటన ఇది. మా కోసం నాన్న 30 ఏళ్ళుగా ఆటో నడిపాడు. ఆయనతో ఆటో నడపడం మాన్పిస్తా. నాన్నతో పాటు కుటుంబాన్ని నేనే చూసుకుంటా. వేలంపాటలో వచ్చిన డబ్బుతో ఇల్లు కొంటా' అని అన్నాడు.