సంతోషం వ్యక్తం చేసిన నటరాజన్
పంజాబ్ జట్టు తనను రూ.3 కోట్లకు కొనుగోలు చేయడంపై నటరాజన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లూ తన కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టమంతా తీరిపోయిందన్న సంతోషం వేలం అనంతరం పేర్కొన్నాడు. అయితే నటరాజన్ ఇలా ప్రతిస్పందించడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
నటరాజన్ తండ్రి రైల్వే పోర్టర్
నటరాజన్ తండ్రి రైల్వే పోర్టర్. తల్లి వీధి వెంబడి చిన్న స్టాల్ను నడుపుతుంది. ఐదుగురు సంతానాన్ని పోషించడం కోసం ఈ ఇద్దరూ 20 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. అలాంటి కుటుంబానికి రూ. 3 కోట్లంటే పెద్ద విషయమే. నటరాజన్ స్వస్థలం తమిళనాడులోని సేలం. అతనికి నిన్నా మొన్నటి వరకు క్రికెట్ బంతి అంటే టెన్నిస్ బాలే.
గొప్ప క్రికెటర్ను కావాలని కలలు కనేవాడు
టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుకునే నటరాజన్కు ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ను కావాలని కలలుగనేవాడు. ఆ కోరికతోనే చెన్నైకి వచ్చి అక్కడ జాలీ రోవర్స్ క్లబ్లో చేరాడు. అశ్విన్, మురళీ విజయ్ ఇదే క్లబ్లో శిక్షణ తీసుకునేవారు.
ఐతే ఈ ఏడాది తమిళనాడు ప్రిమియర్ లీగ్లో ఆడడం ఈ పేసర్ కెరీర్ను మలుపుతిప్పింది.
దిండిగల్ డ్రాగన్స్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన
దిండిగల్ డ్రాగన్స్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన నటరాజన్ అందరి దృష్టిలో పడ్డాడు. 9 ఫస్ట్క్లాస్ మ్యాచ్లే ఆడిన నటరాజన్ 27 వికెట్లు తీసుకున్నాడు. ‘అసలు నేను టీఎన్పీఎల్లో ఆడతాననే అనుకోలేదు. అలాంటిది ఐపీఎల్ వరకూ వచ్చాను. ఇంకా నమ్మశక్యంగా లేదు. చాలా సంతోషంగా ఉంది. టీఎన్పీఎల్కు నన్ను ఎంపిక చేసినపుడు ఒకింత ఒత్తిడికి గురయ్యాను' అని చెప్పాడు.
ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా
'అశ్విన్, విజయ్తోపాటు మా బౌలింగ్ కోచ్ బాలాజీ ఎంతో సహకరించారు. నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ముందుగా రంజీలు ఆడితే చాలనుకున్నాను. అలాంటిది రంజీ కోరిక నెరవేరింది. ఇప్పుడు ఐపీఎల్లోకి కూడా వచ్చేశాను. ఇక్కడ కలిసే ఆటగాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాను' అని నటరాజన్ అన్నాడు.