హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు. ఇమ్రాన్ తాహిర్ పేరుని రెండు సార్లు ఐపీఎల్ వేలంలో ప్రకటించినా అతడిని కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తిని కనబరచలేదు.
బెంగుళూరులో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఉదయం సెషన్లో భాగంగా తాహిర్ పేరు వచ్చినా ప్రాంఛైజీలు అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరచలేదు. అయితే లంచ్ బ్రేక్ అనంతరం కూడా తాహిర్ పేరు వచ్చినా ప్రాంఛైజీలు పెద్దగా పట్టించుకోలేదు.
ఇమ్రాన్ తాహిర్ను ప్రాంఛైజీలు కొనుగోలు చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్ వేలంలో ఇమ్రాన్ తాహిర్ అమ్ముడు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Imran Tahir going unsold is the 'shocker' of the day. Can't fathom how. #IPLAuction
— Aakash Chopra (@cricketaakash) 20 February 2017
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఇమ్రాన్ తాహిర్తో పాటు టీమిండియాకు చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. సోమవారం జరిగిన వేలంపాటలో విదేశీ ఆటగాళ్లకు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోగా.. భారత క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా మొగ్గు చూపలేదు.
టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఏ ప్రాంఛైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. మరో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ను సైతం కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. పఠాన్ కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించినా ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
ఇదే విధంగా టీమిండియా ఆటగాళ్లు ప్రజ్ఞాన్ ఓజా, ఉన్ముక్త్ చంద్, పృథ్వీషా, రాహుల్ శర్మలను కూడా చేదు అనుభవమే ఎదురైంది. వీరితో పాటు న్యూజిలాండ్కు చెందిన ఇష్ సోధీ, మిచెల్ షట్నర్, కోలిన్ మున్రో, జేమ్స్ నీషమ్లు ఐపీఎల్ వేలంలో చేదు అనుభవానికి గురయ్యారు.
దక్షిణాఫ్రికాకు చెందిన వేన్ పర్నేల్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాన్నీ బెయిర్ స్టో, బంగ్లాదేశ్ మెహిదీ హాసన్, షబ్బీర్ రెహ్మాన్లు కూడా ప్రాంఛైజీలను ఆకర్షించడంలో విఫలమయ్యారు.