చివరి బంతికి సిక్స్
చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ని గెలిపించిన సందర్భాలెన్నో. అలాంటి మ్యాచ్ ఫినిషర్ క్రీజులో ఉండగా గెలవడం కష్టమని భావించిందో ఎమో గానీ ముంబై మాత్రం తనదైన వ్యూహంతో ధోనిని అవుట్ చేసి టైటిల్ను సొంతం చేసుకుంది. క్వాలిఫయర్-1లో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించిన ధోని ఫైనల్ మ్యాచ్లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు.
స్వల్ప లక్ష్యాన్ని సైతం ఎదుర్కొలేక పోయిన పూణె
ముంబై ఇండియన్స్ నిర్దేశిచిన స్వల్ప లక్ష్యాన్ని సైతం ఎదుర్కొలేక అభిమానులను నిరాశపరిచాడు. దీంతో రైజింగ్ పుణె భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఆదివారం ఉప్పల్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఒక్క పరుగు తేడాతో పూణెపై విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది.
ధోని అవుటైన తర్వాత మ్యాచ్ మలుపు
పైనల్ మ్యాచ్లో ప్రారంభం నుంచీ విజయం వైపు ఉన్న పూణె ధోని అవుటైన తర్వాత మ్యాచ్పై పట్టుని కోల్పోయింది. అనంతరం ముంబై బౌలర్లు చెలరేగారు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని... స్మిత్తో ఆచితూచి ఆడుతూ చక్కటి భాగస్వామ్యాలను నిర్మించేందుకు యత్నించాడు.
పూణె కొంప అక్కడే మునిగింది
ఇదే పూణె కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. ఈ సమయంలో ఓవర్కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు.
వేగంగా ఆడలేకపోయిన స్మిత్
ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం.
పూణెకి అవకాశం ఇవ్వని ముంబై
పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని అవుటైన తర్వాత మ్యాచ్పై పట్టు సాధించిన ముంబై... పూణెకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది.