హైదరాబాద్: సోమవారం హైదరాబాద్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో బౌలర్ భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడాడు.
హైదరాబాద్ VS పంజాబ్ మ్యాచ్ స్కోరుకార్డు
ఈ సందర్భంగా డెత్ ఓవర్స్లో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం అలవాటైందని భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ అద్భుతం చేశాడు. ఐపీఎల్ పదో సీజన్లో భువనేశ్వర్ కుమార్ 5/19 అద్భుత గణాంకాలు నమోదు చేశాడు.
'నా హృదయం ఇంకా వేగంగానే కొట్టుకొంటోంది. ఊహించని పరిణామాలు జరగడమే టీ20 క్రికెట్. 19వ ఓవర్ వేయాలని నాకు తెలుసు. కొన్నేళ్లుగా సన్రైజర్స్కు ఈ పని చేస్తున్నా' అని భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ అనంతరం మీడియాతో చెప్పాడు.
'నేను 16 లేదా 17వ ఓవర్ వేసేటప్పుడు క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడని తెలుసు. దాని గురించి ఆందోళన పడకుండా ఏదైనా పథకం రచిస్తా. పంజాబ్ మ్యాచ్లో వార్నర్, నేను నేరుగా యార్కర్లు విసరాలని ప్రణాళిక రచించాం. అది విజయవంతమైంది' అని అన్నాడు.
నిజానికి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేందుకు అలవాటు పడిపోయానని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. గత కొన్ని సీజన్లుగా డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయడంతో ఆత్మవిశ్వాసం పెంచుకొన్నానని భువీ చెప్పాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భువీ లాంటి బౌలర్ ఉండటం జట్టుకు అదనపు బలమేనని డేవిడ్ వార్నర్ సైతం ప్రశంసలు కురిపించాడు.