హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్కు అనూహ్యంగా ఐపీఎల్ పదో సీజన్లో ఆడే అవకాశం దక్కింది. గాయం కారణంగా గుజరాత్ లయన్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఐపీఎల్కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో గుజరాత్ లయన్స్ తరుపున ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగనున్నాడు.
గాయం నుంచి 100 శాతం కోలుకోని సందర్భంగా ఐపీఎల్కి దూరమవుతోన్నట్లు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బ్రావో స్ధానంలో ఇర్ఫాన్ను తీసుకోవాలని గుజరాత్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి పఠాన్ గుజరాత్ లయన్స్ జట్టుతో కలిశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన 2017 సీజన్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఈ వేలంలో ఇర్ఫాన్ పఠాన్ కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. పఠాన్తో పాటు పేసర్ ఇషాంత్ శర్మ కూడా వేలంలో అమ్ముడు పోలేదు.
టోర్నమెంట్ మొదలైన తర్వాత అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీసుకుంది. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల పాటు ఐపీఎల్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్ తరపున ఆడాడు. అంతకుముందు చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.