హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు మనన్ వోహ్రా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద విలియమ్సన్ కొట్టిన సిక్సర్ను గాల్లోనే ఆపేసి నాలుగు పరుగులు ఆదా చేశాడు. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్లు తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు.
ఈ ఇద్దరూ పవర్ ప్లేలో 60 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో వార్నర్ 25 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా, ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ చేశారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వార్నర్ 51 ( 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ కూడా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ (48 బంతుల్లో 77; 9 ఫోర్లు, ఒక సిక్సు) మోహిత్ శర్మ బౌలింగ్లో ఓ భారీషాట్కు ప్రయత్నించి మ్యాక్స్ వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతక ముందు ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వోహ్రా ఈ అద్భుతం చేశాడు.
ఐదో బంతిని ఇషాంత్ శర్మ షార్ట్పిచ్లో వేశాడు. క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ విలియమ్సన్ ఆఫ్సైడ్ రెండు అడుగులు జరిగి తన బలాన్ని అంతా ఉపయోగించి బంతిని బలంగా బాదాడు. దీంతో బంతి డీప్ మిడ్వికెట్ వైపు గాల్లోకి లేవడంతో అందరూ సిక్సర్ అని అనుకున్నారు.
అయితే ఇంతలో అక్కడికి చేరుకున్న ఫీల్డర్ మనన్ వోహ్రా అద్భుతంగా గాల్లోకి ఎగిరి బంతిని అందుకొన్నాడు. అయితే బంతి అదుపు తప్పి బౌండరీ లైన్కి అవతల పడిపోతానని తెలుసుకొని రెప్పపాటులో బంతిని ముందుకు విసిరాడు. అనంతరం అతడు కింద పడిపోయాడు. దీంతో పంజాబ్కు నాలుగు పరుగులు ఆదా చేశాడు.