హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది.
ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్ పంత్ (45), శ్రేయస్ అయ్యర్ (32) రాణించగా మిగతా వారంతా నిరాశ పరిచారు. బెంగళూరు బౌలర్లలో పవన్ నేగి, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, ట్రావిస్ హెడ్ రెండు, షేన్ వాట్సన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
ఢిల్లీ విజయ లక్ష్యం 162
ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (58: 45 బంతుల్లో 3x4, 3x6), క్రిస్గేల్ (48: 38 బంతుల్లో 3x4, 3x6) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్కు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ విష్ణు వినోద్ (3) నిరాశపరిచినప్పటికీ, క్రిస్గేల్తో జత కలిసిన విరాట్ కోహ్లీ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ వరుసగా బౌండరీలు బాదారు.
దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 96 పరుగులతో మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. ఈ దశలో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని స్పిన్నర్ నదీమ్ విడదీశాడు. మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ కోసం ప్రయత్నించిన క్రిస్గేల్ ఫీల్డర్ జహీర్ ఖాన్ చేతికి చిక్కాడు.
అనంతరం వచ్చిన ట్రావిస్ హెడ్ (2) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ దశలో కాసేపు నిలకడగా ఆడిన కోహ్లీ.. జహీర్ ఖాన్ బౌలింగ్లో సిక్స్ బాదాడు. అదే ఊపులో మరో భారీ షాట్ కోసం ప్రయత్నించిన క్రమంలో బౌండరీ లైన్ వద్ద నదీమ్ చేతికి చిక్కాడు.
చివర్లో బ్యాటింగ్కు దిగిన కేదార్ జాదవ్ (12), సచిన్ బేబి (12) నిరాశపరిచినా పవన్ నేగి (13 నాటౌట్) వరుసగా మూడు బౌండరీలతో చెలరేగడంతో బెంగళూరు 161 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీయగా.. జహీర్ ఖాన్, నదీమ్ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్లాడిన ఢిల్లీ ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొందిన బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లకు టోర్నీలో ఇది చివరి మ్యాచ్. దీంతో విజయంతో ముగించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఢిల్లీ డేర్డెవిల్స్:
సంజు శాంసన్, కరుణ్ నాయర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్లోన్ శ్యామ్యూల్స్, కోరె అండర్సన్, పాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, నదీమ్, జహీర్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, విష్ణు వినోద్, ట్రావిస్ హెడ్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్, సచిన్ బేబి, పవన్ నేగి, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యుజ్వేందర్ చాహల్