హైదరాబాద్: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 231 భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముంబై ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ స్ట్రైకింగ్ అవకాశం కోసం ఉద్దేశపూర్వకంగానే 'షార్ట్ రన్' చేశాడా? అతనిపై చర్య తీసుకునే అవకాశం ఉందా? అని క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.
231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులకు అవసరమయ్యాయి. పంజాబ్ బౌలర్ మోహిత్ శర్మ తొలి బంతిని యార్కర్గా సంధించాడు. దీనిని అతి కష్టం మీద లెగ్ సైడ్వైపు తరలించిన పొలార్డ్ .. రెండు పరుగులు వస్తాయనుకున్నాడు.
కానీ ఫీల్డర్ దూసుకొచ్చి బంతిని చేజిక్కంచుకోవడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్వైపు క్రీజులో బ్యాట్ పెట్టకుండానే (పరుగు పూర్తి చేయకుండానే) వెనక్కి వచ్చేశాడు పొలార్డ్. దీనిని గమనించిన అంపైర్ ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ముంబై ఒక పరుగుని కోల్పోతే కోల్పోయింది కానీ పొలార్డ్కు స్ట్రైకింగ్ అవకాశం దక్కింది.
ఈ సమయంలో పొలార్డ్ క్రీజులో ఉన్నాడు కాబట్టి ముంబై గెలవడం ఖాయం అనుకున్నారు. ఆ తర్వాత రెండో బంతికి సిక్స్గా మలిచాడు. ఆ తర్వాత నాలుగు బంతుల్లో ఒకే ఒక్క పరుగు దక్కింది. మూడు బ్రహ్మాండమైన యార్కర్లు వేసిన మోహిత్... పొలార్డ్ పరుగులు చేయకుండా భళేగా కట్టడి చేశాడు.
దీంతో పదో సీజన్లో ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తడబడకుండా నిలబడింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. అయితే ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఆన్ఫీల్డ్ అంపైర్లు బ్యాట్స్మన్ను హెచ్చరించవచ్చు కూడా.
ఆ బంతికి వచ్చిన పరుగులను సైతం స్కోరు బోర్డు నుంచి తీసేయొచ్చు. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది కాబట్టి అంపైర్లు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.