హైదరాబాద్: తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ పైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, ఐపీఎల్ పదో సీజన్లో ఎక్కువ మంది చర్చించిన క్రికెటర్గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు.
ఐపీఎల్: ట్విట్టర్లో కోహ్లీని మించి సత్తా చాటిన ధోని
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఆటగాళ్లు ఎమోజీలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎమోజీ ఛార్ట్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్ధానంలో నిలిచాడు. తమ అభిమాన ఆటగాడి ఎమోజీ ఫోటోతో హ్యాష్ టాగ్ చేస్తారు.
రెండో స్ధానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలవగా ఆ తర్వాతి స్ధానాల్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా నిలిచారు. పదేళ్ల ఐపీఎల్ను పురస్కరించికుని మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేందుకు గాను 30 మంది టాప్ క్రీడాకారుల ఎమోజీలను ట్విట్టర్ ప్రవేశపెట్టింది.
వీరిలో అభిమానులు అత్యధికంగా ధోని ఎమోజీనే ట్విట్టర్లో వినియోగించడం విశేషం. ఇటీవలే ఐపీఎల్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ తన తుది డేటాను విడుదల చేసింది. ఈ డేటాలో ధోని ఎమోజీ టోర్నీ మొత్తం మీద అత్యధిక సార్లు ట్వీట్ చేసిన ఎమోజీగా ఐపీఎల్ నిర్వహకులు గుర్తించారు. పూణె ప్రాంచైజీ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించినా అతడి పాపులారిటీ మాత్రం తగ్గలేదు.
ఐపీఎల్ పదో సీజన్లో #MSDhoni అనే హాష్ ట్యాగ్ మొదటి ఐదు స్ధానాల్లో నిలిచిందని ట్విట్టర్ హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ పాట్నర్షిప్స్(ఇండియా, దక్షిణ ఆసియా) అనీశ్ మదాని వెల్లడించారు. నిజానికి ఐపీఎల్ పదో సీజన్లో ధోని తన బ్యాటుతో పెద్దగా రాణించలేదు.
టోర్నీ మొత్తం మీద ధోని 26.36 యావరేజీతో 290 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక అర్ధ సెంచరీ ఉండటం విశేషం. ఐపీఎల్ పదో సీజన్లో #CricketMeriJaan by Mumbai Indians, #IPLFinal, #AmiKKR by Kolkata Knight Riders, #MSDhoni, and #MI మొదటి ఐదు హాష్ ట్యాగ్లని తెలిపారు.