హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో పదివేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో థంపీ బౌలింగ్లో నాలుగో ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి మూడు పరుగులు సాధించడంతో ఈ ఘనత సాధించాడు.
దీంతో టీ20 క్రికెట్లో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. ఐపీఎల్ పదో సీజన్కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్ ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ల్లో ఈ రికార్డుని సాధిస్తాడని అభిమానులు భావించినా అది జరగలేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన 60 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్ ఆరంభ వేడుకల అనంతరం సన్ రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో క్రిస్ గేల్ 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి రావడంతో రెండు మ్యాచ్లకు గేల్ దూరమయ్యాడు.
ఇలా ఈ సీజన్లో వరుస వైఫల్యాల తర్వాత మంగళవారం క్రిస్ గేల్ ఈ రికార్డుని సాధించాడు. రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్ క్రిస్ గేల్ కెరీర్లో 290వ టీ20. ఈ మ్యాచ్కు ముందు అతడు 9,997 పరుగులతో ఉన్నాడు. 285 ఇన్నింగ్స్లు ఆడిన గేల్ 18 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలను సాధించాడు.
టీ20 ఫార్మెట్లో క్రిస్ గేల్ అత్యధిక స్కోరు 175 నాటౌట్. అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక పరుగులు, సిక్సర్లు, ఫోర్లు ఇలా అన్ని రికార్డులు క్రిస్ గేల్ పేరిటే ఉండటం విశేషం. గాయం కారణంగా బెంగళూరు జట్టులో డివిలియర్స్ ఆడడం లేదు. అతడి స్థానంలో క్రిస్గేల్కు తుది జట్టులోకి చోటు కల్పించారు.