హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో వరుస ఓటములతో పూర్తిగా నిరాశ చెందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ అన్నాడు. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో బెంగళూరు ఒకటి. గత సీజన్లో పైనల్కు చేరిన ఆర్సీబీ ఈ ఏడాది మాత్రం మూడు విజయాలతో 7 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఆర్సీబీ వైఫల్యంపై క్రిస్ గేల్ స్పందించాడు. 'వరుస ఓటములతో పూర్తిగా నిరాశచెందాం. ఈ సీజన్ మాకు పాఠం నేర్పించింది. వైఫల్యాలతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. జట్టులో లోపాలు తెలుసుకున్నా ఆర్సీబీ సమిష్టిగా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఇంకా చెప్పాలంటే బౌలర్లు, బ్యాట్స్మెన్లలో ఏ ఒక్కరూ రాణించకపోవడం ఆర్సీబీని దారుణంగా దెబ్బతీసింది' అని అన్నాడు.
'అలాంటి సమయాలలో సమష్టిగా గేమ్ ప్లాన్ చేసుకుని ఆడాలి. అప్పుడు విజయాల బాట పట్టేవాళ్లం. కానీ ఆర్సీబీ అలా చేయకపోవడంతో చివరికి అట్టడుగున నిలవాల్సి వచ్చింది. వచ్చే సీజన్లో మంచి ప్రదర్శన చేస్తామని' క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ సీజన్లో ఆఖరి మ్యాచ్ని మాత్రం కోహ్లీసేన విజయంతో ముగించడం విశేషం.
ఇదిలా ఉంటే బెంగళూరు చెత్త ప్రదర్శనపై కోహ్లీ కూడా స్పందించాడు. తమకు అంతగా కలిసిరాని ఐపీఎల్ పదో సీజన్ను బెంగళూరు ఆటగాళ్లు ఎంత తొందరగా మరచిపోతే అంత మంచిదని అన్నాడు. పదేళ్ల ఐపీఎల్లో తమపై అత్యంత ప్రభావం చూపిన సీజన్ ఏదైనా ఉందంటే అది ఇదేనని కోహ్లి పేర్కొన్నాడు. ఈ సీజన్ చాయలు ఎక్కడ కనిపించకుండా తదుపరి ఐపీఎల్కు సిద్ధమవుతామని పేర్కొన్నాడు.