హైదరాబాద్: మరికొద్ది గంటల్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు యజమాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా ఓ ఇంగ్లీషు దినపత్రికు ఇచ్చిన ఇంటర్యూలో పూణె యజమాని సంజీవ్ గొయాంకా ధోనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే సంజీవ్ గొయాంకా సోదరుడైన హర్ష్ గొయాంకా ధోనిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం, అతడికి వ్యాఖ్యలకు ధోని బార్య సాక్షి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి సంజీవ్ గొయాంకా.. ధోని, స్మిత్ జట్టులోని ఇతర ఆటగాళ్ల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
'ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అతను. అతని మైండ్ సెట్, గెలవాలనే తపన అమోఘం. అయితే ధోనీ కన్నా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడు ఇంకొకరున్నారు.. అతనే స్టీవ్ స్మిత్. గెలుపు తప్ప మరేదీ వద్దనుకునే యాటిట్యూడ్ స్మిత్ది. అందుకే సహచర ఆటగాళ్లకు '12 బంతుల్లో 30 పరుగులు కొట్టు.. లేదా, అవుటై వచ్చెసెయ్..' లాంటి సూచనలు చేస్తాడు' అని అన్నాడు.
'కష్టసమయాల్లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల స్మిత్ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్లలో పుణె జట్టు సరిగా ఆడలేకపోయింది' అంటూ స్టీవ్ స్మిత్ను పొగడ్తలతో ముంచెత్తిన గొయాంకా, జట్టు విజయయాత్రలో ధోని పాత్ర ఏమాత్రం లేదన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మే 21న జరిగే ఫైనల్స్లో పుణె జట్టు ముంబైతో తలపడనున్న సంగతి తెలిసిందే. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికలో లోపాల వల్లే గతేదాడి పూణె మెరుగ్గా రాణించలేదని గొయాంకా అన్నారు. ఈ సారి స్మిత్ చెప్పినట్లే.. ఇమ్రాన్ తాహిర్, బెన్ స్టోక్స్లు రాణించారని, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి లాంటి స్ధానిక ఆటగాళ్లు రాణించడం కలిసొచ్చిందని గొయాంకా అన్నారు.