పంజాబ్ ఆట తీవ్రంగా నిరాశపరిచింది
'పంజాబ్ ఆట తీవ్రంగా నిరాశపరిచింది. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. టాపార్డర్ బ్యాట్స్మెన్ ఎవరో ఒకరు 12-15 ఓవర్లు ఆడాలనేది వ్యూహం. కానీ విదేశీ ఆటగాళ్లెవరూ ఈ బాధ్యత తీసుకోలేదు. పిచ్ మందకొడిగా ఉందని విదేశీ ఆటగాళ్లు చెప్పారు' అని సెహ్వాగ్ అన్నాడు.
పిచ్ మందకొడిగా ఉంది
'పిచ్ మందకొడిగా ఉందని విదేశీ ఆటగాళ్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి పిచ్లపైనైనా ఆడాలి. జట్టు కోసం కనీసం 20 ఓవర్లైనా నిలవలేరా? మాక్స్వెల్, షాన్ మార్ష్, మోర్గాన్ల ఆట తీవ్రంగా బాధించింది. 10-12 ఓవర్లు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత మార్ష్ది' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
బాధ్యతయుతంగా ఆడలేదు
'కానీ ఆ దిశగా బాధ్యతయుతంగా మార్ష్ ఆడలేదు. అంతర్జాతీయ అనుభవం ఉన్న కెప్టెన్ మాక్స్వెల్, మోర్గాన్లు కూడా జాగ్రత్తగా ఆడలేదు. కెప్టెన్గా మాక్స్వెల్ నిరాశపరిచాడు. అతడు తన బాధ్యతలను గుర్తించలేదు. ముంబై, కోల్కతా జట్లపై గెలిచిన విధంగానే పూణెపై కూడా సత్తా చాటుతారని భావించా. ఆమ్లా దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది' అని సెహ్వాగ్ అన్నాడు.
టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం
పూణెతో జరిగిన మ్యాచ్ పంజాబ్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పంజాబ్ జట్టు పవర్ప్లే ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. పూణె బౌలర్ల దెబ్బకు అప్పటికే విదేశీ ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరారు. దీంతో పంజాబ్పై పూణె 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.