హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ వ్యాఖ్యానించాడు. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈడెన్ గార్డెన్స్లో గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ నెట్ ప్రాక్టీస్ అనంతరం మిల్లర్ మీడియాతో మాట్లాడాడు. 'గతేడాది దూకుడుగా ఆడే తన ఆటను కోల్పోయాను. ఇది ఐపీఎల్తో సహా నా దేశానికి ఆడే సమయంలో ప్రభావాన్ని చూపింది' అని మిల్లర్ అన్నాడు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు తమ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ నుంచి విలువైన సూచలను స్వీకరించానని చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ తన జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను తనకు వివరించాడని, నిజంగా ఆ ఒక్క సలహా తన ఆటతీరుని మార్చివేసిందని తెలిపాడు.
టెక్నిక్ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవద్దని, ఎప్పుడైతే స్లో బాల్ పడుతుందో దానిని బలంగా కొట్టాలని సూచించాడు. ఈ సలహా ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. 'ప్రస్తుత సీజన్లో చాలా స్వేచ్ఛగా ఆడుతున్నాను. బంతిని ఎదుర్కొన్న ప్రతిసారీ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నా. ఈ సీజన్లో నా ప్రదర్శనను చూసినట్లైతే ఆ విషయం తెలుస్తుంది' అని అన్నాడు.
ఇక గురువారం కోల్కతాతో జరగనున్న మ్యాచ్పై కూడా డేవిడ్ మిల్లర్ స్పందించాడు. గాయం కారణంగా ఈరోజు నాటి మ్యాచ్కి క్రిస్ లిన్ జట్టుకు దూరమవ్వడం తమ జట్టుకు లాభించే విషయమని పేర్కొన్నాడు. క్రిస్ లిన్ మాదిరే తమ జట్టులో X ప్యాక్టర్ లాంటి ఆటగాడు ఉన్నాడని చెప్పాడు.
అతడు ఎవరో కాదు తమ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అని చెప్పాడు. టీ20 ఫార్మెట్లో క్రిస్ లిన్, మ్యాక్స్ వెల్ ఇద్దరూ డేంజరస్ ఆటగాళ్లని డేవిడ్ మిల్లర్ కొనియాడాడు.