హైదరాబాద్: ఏప్రిల్ 5న ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశాలున్నాయి. రాంచీ టెస్టు తొలిరోజు ఆటలో గాయపడిన కోహ్లీ నాలుగో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు.
ఆ తర్వాత ధర్మశాల టెస్టుకు ముందు 100 శాతం ఫిట్గా ఉంటేనే ఆడతానన్న కోహ్లీ ఫిట్నెస్ టెస్టులో విఫలమవడంతో చివరి టెస్టుకు దూరమయ్యాడు. రహానే నేతృత్వంలోని టీమిండియా చివరి టెస్టులో ఆసీస్పై 8 వికెట్లతో ఘన విజయం సాధించిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
గాయం చిన్నదనుకున్నానని కానీ పెద్దగా ప్రభావం చూపిందని తెలిపాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా కోన్ని వారాల సమయం పడుతుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 100 శాతం ఫిట్ అయిన తర్వాతే ఐపీఎల్లో ఆడతానని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని అన్నాడు.
ఎప్పటికి కోలుకునేది చెప్పలేనని, గాయంపై త్వరలో ఫిజియో స్పష్టత ఇస్తాడు కోహ్లీ తెలిపాడు. దీంతో ఐపీఎల్ తొలి మ్యాచ్లో కోహ్లీ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్ 4న హైదరాబాద్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న హైదరాబాద్తో, 8న ఢిల్లీ డేర్డెవిల్స్తో, 10న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగే మూడు మ్యాచ్లకు కోహ్లీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లకు గాయాల బెడద వదలట్లేదు. గాయం కారణంగా ఇప్పటికే ఢిల్లీ ఆటగాడు జెపి డుమిని ఐపీఎల్కు దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే గత ఐపీఎల్లో కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేసి బెంగుళూరుని ఫైనల్కు చేర్చాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ మూడు సార్లు ఫైనల్లో తలపడి టైటిల్ అందుకోలేక పోయింది.