హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎన్నో వివాదాలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల ఆటగాళ్లు ఏమాత్రం తగ్గకుండా మాటల యుద్ధానికి దిగడంతో సిరిస్ అమాంతం ఉత్కంఠగా సాగింది. అయితే ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 10వ సీజన్లో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లను పంచుకోవాల్సి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టెస్టు సిరిస్లో చోటు చేసుకున్న వివాదాలను పట్టించుకోరాదని టీమిండియా ఆటగాడు వృద్ధిమాన్ సాహా అన్నాడు. ధర్మశాల టెస్టులో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 2-1తేడాతో టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సిరిస్ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లిన సాహా మీడియాతో మాట్లాడాడు.
'ఐపీఎల్లో భాగంగా మాక్స్వెల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో భాగస్వామ్యులవుతాం. ప్రొఫెషనల్ ఆటగాడిగా జట్టు విజయాల కోసం యాజమాన్యంతో కలిసి పనిచేస్తాం. ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎప్పుడూ ముందుకెళ్లాలి. అంతేగానీ గతంలో ఏం జరిగింది అని ఆలోచిస్తూ వెనుదిరిగి చూసుకోకూడదు' అని సాహా అన్నాడు.
జట్టులో చేరినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి. మనకు ఏం బాధ్యతలు అప్పగిస్తున్నారో గమనించాలని సాహా తెలిపాడు. రాబోయే రోజుల్లో పుజారా, రవీంద్ర జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాలని తాను కొరుకుంటున్నట్టు సాహా వెల్లడించాడు. ఏ ఫార్మాట్ ఆటలోనైనా స్లెడ్జింగ్ను ఎల్లప్పుడూ ఎంజాయ్ చేస్తానని అన్నాడు.
ఐపీఎల్ కోసం ముందు జాగ్రత్తగా కోహ్లీ చివరి టెస్టుకు దూరమయ్యాడని బ్రాడ్ హాడ్జ్ వ్యాఖ్యలు అర్ధరహితమని సాహా పేర్కొన్నాడు. టెస్టు సిరీస్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లు నా స్నేహితులు కారు అన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై కూడా సాహా స్పందించాడు.
అవి కోహ్లీ వ్యక్తిగత వ్యాఖ్యలని అభిప్రాయపడ్డాడు. రాంచీ టెస్టు సెంచరీ తనకి ఎప్పటికీ ప్రత్యేకమేనని, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్లో పూర్తి ఫిట్నెస్తో పాల్గొంటానని సాహా స్పష్టం చేశాడు.