కాన్పూర్: భారత స్టార్ బ్యాట్స్మన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చేసిన అత్యధిక పరుగుల(4వేలు) రికార్డును గుజరాత్ లయన్స్ సారథి సురేష్ రైనా బ్రేక్ చేశాడు. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగులు చేసిన రైనా ఈ ఘనతను సాధించాడు.
ఇప్పటి వరకు రైనానే అత్యధిక పరుగులు చేసిన ఐపిఎల్ ఆటగాడి కొనసాగాడు. అయితే, ఇటీవల భీకరమైన ఫాంలో ఉన్న కోహ్లీ.. రైనాను అధిగించాడు. కాగా, గురువారం నాటి మ్యాచ్లో అర్ధశతకం పూర్తి చేసిన రైనా.. తిరిగి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు సృష్టించాడు.
గుజరాత్ అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన లయన్స్ గురువారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో కోల్కతాను చిత్తు చేసింది. స్మిత్ ధాటికి విలవిల్లాడిన కోల్కతా మొదట 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. కోహ్లీ 4002 పరుగులు చేయగా.. గురువారం నాటి మ్యాచ్లో ఆ పరుగులను రైనా అధిగించాడు.
కోహ్లీ రికార్డును అధిగమించాడానికి రైనాకు 18 పరుగులు అవసరం కాగా, 53 పరుగులు నమోదు చేశాడు రైనా. కాగా, గురువారం నాటి మ్యాచ్లో తమ జట్టు గెలుపులో రైనా, డ్వేన్ స్మిత్లు కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య గురువారం ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ మరో 39 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. నైట్రైడర్స్ ఎనిమిది వికెట్లకు 124 పరుగులు చేయగా.. గుజరాత్ 13.3 ఓవర్లలోనే, నాలుగు వికెట్లకు 125 పరుగులు సాధించింది. డ్వెయిన్ స్మిత్ 8 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, నైట్రైడర్స్ను దెబ్బతీయడంతో ఆ తర్వాత స్వల్పమైన లక్ష్యాన్ని ఛేదించడం గుజరాత్కు కష్టం కాలేదు.
లక్ష్యం చిన్నదే అయినా ఛేదన ఆరంభంలో గుజరాత్ తడబడింది. 18 పరుగులకే ప్రమాదకర ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (0), బ్రెండన్ మెక్కలమ్ (6)ల వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ ఔట్ కాగా.. రెండో ఓవర్లో నరైన్కు మెక్కలమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దినేశ్ కార్తీక్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేదు. జట్టు స్కోరు 38 వద్ద మోర్నీ బౌలింగ్లో బౌల్డయ్యాడు.
అయితే కెప్టెన్ రైనా, ఫించ్ గుజరాత్ను ఆదుకున్నారు. రైనా మరింత దూకుడు ప్రదర్శించాడు. చక్కని షాట్లతో అలరించాడు. ఫించ్ రెండు సిక్స్లు బాదాడు. ఈ జంట నాలుగో వికెట్కు వేగంగా 59 పరుగులు జోడించింది. పదో ఓవర్లో జట్టు స్కోరు 97 వద్ద ఫించ్ రనౌటైనా గుజరాత్ కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. రవీంద్ర జడేజా (11 నాటౌట్)తో కలిసి రైనా ఛేదన పూర్తి చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా.. ఫాస్ట్బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై తడబడింది. తొలి మూడు ఓవర్లలో 23/0తో కాస్త ఫర్వాలేదనిపించే స్థితిలోనే ఉన్నా.. నాలుగో ఓవర్లో జకాతి చక్కని త్రోకు గంభీర్ (8) రనౌట్ కావడంతో ఆ జట్టు పతనం ఆరంభమైంది. ఆ తర్వాత స్మిత్ బంతిని అందుకోవడంతో కోల్కతా పతనం వేగంగా సాగింది.
ఐదో ఓవర్లో కేవలం రెండే పరుగులిచ్చిన స్మిత్.. మనీష్ పాండే (1)ను ఔట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో కేవలం మూడు పరుగులిచ్చి ఉతప్ప (25; 19 బంతుల్లో 3×4, 1×6)ను వెనక్కి పంపాడు. పదో ఓవర్లో అతడు చావ్లా (11)ను ఔట్ చేసేటప్పటికి కోల్కతా స్కోరు 55 పరుగులు మాత్రమే. తన తర్వాతి ఓవర్లో షకిబ్ (3)ను కూడా పెవిలియన్ చేర్చిన స్మిత్.. 61/5తో కోల్కతాను మరింత ఇబ్బందుల్లో నెట్టాడు.
మరోవైపు స్పిన్నర్ జకాతి కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి మూడు ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చాడు. వికెట్లు పోతున్నా యూసుఫ్ పఠాన్ మాత్రం కోల్కతాను ఆదుకునే ప్రయత్నం చేశాడు.. కానీ వేగంగా ఆడలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి 25 బంతుల్లో అతడు 14 పరుగులే చేయడం గమనార్హం.
ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. నిజానికి 7 నుంచి 14వ ఓవర్ వరకు కోల్కతాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అయితే జడేజా వేసిన 15వ ఓవర్లో యూసుఫ్ వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. సూర్యకుమార్ (17; 14 బంతుల్లో ఫోర్, సిక్స్), హోల్డర్ (13; 8 బంతుల్లో ఫోర్, సిక్స్) కూడా కాస్త బ్యాట్ ఝుళిపించడంతో కోల్కతా 18 ఓవర్లలో 116/6తో నిలిచింది. కానీ చివరి రెండు ఓవర్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ రెండు ఓవర్లలో కులకర్ణి, బ్రావోలు 8 పరుగులు మాత్రమే ఇచ్చి యూసుఫ్, హోల్డర్లను ఔట్ చేశారు.
కాగా, గుజరాత్ ఈ విజయంతో, 16 పాయంట్లతో సన్రైజర్స్తో కలిసి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ జట్టు తర్వాతి మ్యాచ్ని ముంబయ ఇండియన్స్తో శనివారం ఆడుతుంది. నైట్రైడర్స్ 22న సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది.
ఈ ఇన్నింగ్స్లో 25 పరుగులు చేసిన నైట్రైడర్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప టి-20 ఫార్మెట్లో 5,000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో బ్యాట్స్మన్గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, గౌతం గంభీర్ ఈ ఫీట్ను సాధించారు.
కాన్పూర్లోని గ్రీన్ పార్క్ మైదానంలో మొట్టమొదటిసారి డే/నైట్ మ్యాచ్ జరిగింది. ఏ ఫార్మెట్లోనూ ఇంత వరకూ వరకూ ఈ స్టేడియంలో డే/నైట్ లేదా నైట్ మ్యాచ్ జరగలేదు. మొదటి పది ఓవర్లలో నైట్రైడర్స్ 60 కంటే తక్కువ పరుగులు చేయడం ఇది రెండోసారి. ఈ రెండూ గుజరాత్ లయన్స్పైనే కావడం గమనార్హం. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో 57 పరుగులు చేస్తే, తాజాగా కాన్పూర్లో 55 పరుగులు మాత్రమే సాధించింది.
గుజరాత్ లయన్స్ ఆల్రౌండర్ డ్వెయిన్ స్మిత్ ఈ ఇన్నింగ్స్లో కేవలం ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి, నైట్రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ఒక ఐపిఎల్ ఇన్నింగ్స్లో నాలుగు లేదా అంతకు మించి వికెట్లకు అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది.
నైట్రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ రనౌట్లలో రికార్డు సృష్టించాడు. తాజా సంఘటనతో కలిపితే, టి-20 ఫార్మెట్లో అతను రనౌట్ కావడం 21వ సారి. ఈ ఐపిఎల్లో అతనికి ఇది నాలుగో రనౌట్. టి-20 ఫార్మెట్లో అత్యధిక పర్యాయాలు రనౌట్గా వెనుదిరిగిన బ్యాట్స్మన్గా జయవర్ధనే పేరిట ఉన్న రికార్డును గంభీర్ అధిగమించాడు. జయవర్ధనే 20సార్లు రనౌటయ్యాడు.