హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం బెంగళూరులో మొదలైంది. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఈ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, తైమాల్ మిల్స్ రికార్డు ధరకు అమ్ముడై సంచలనం సృష్టించారు. ఎవరూ ఊహించని రీతిలో ఫ్రాంచైజీలు ఈ ఇద్దరి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు.
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కోసం హోరాహోరీ సాగుతుందని ముందే అందరూ ఊహించినా.. టీ20 స్పెషలిస్ట్ తైమాల్ మిల్స్ను రూ.12 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడమే ఆశ్చర్య పరిచింది. బెన్ స్టోక్స్ను రూ.14.5కోట్లకు పుణె కొనుగోలు చేసింది.
తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. బెన్ స్టోక్స్ను దక్కించుకోవడానికి పలు ప్రాంఛైజీలు ప్రయత్నించినప్పటికీ పుణు రికార్డు ధర చెల్లించి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ 14.5కోట్లకు అమ్ముడుపోయాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చే బెన్ స్టోక్స్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు, బౌలింగ్లోనూ సత్తా చాటుతాడనే పేరొంది. ఇటీవల భారత పర్యటనలోనూ బెన్ స్టోక్స్ మెరుగ్గా రాణించడం వల్లే ఇంత పెద్ద మొత్తం వెచ్చించారని క్రికెట్ విశ్లేషకలు అంటున్నారు.
కేవలం 4 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టైమాల్ మిల్స్ కోసం కూడా ఫ్రాంచైజీలు విపరీతంగా పోటీ పడటం విశేషం. అతని కోసం ముంబై, పంజాబ్ మధ్య హోరాహోరీ సాగింది. చివర్లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా పోటీ పడింది. అయితే పది కోట్ల బిడ్ దాటిన తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మిల్స్ను రూ.12 కోట్లు కొనుగోలు చేసింది.
నాలుగు టీ20ల్లో అతడు తీసింది కేవలం మూడు వికెట్లు మాత్రమే. ఇక న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, సౌతాఫ్రికా బౌలర్ కాగిసో రబాడాలు రూ.5 కోట్లు పలకగా.. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయాడు. కమిన్స్, రబాడాలను ఢిల్లీ.. బౌల్ట్ను కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.